యూట్యూబర్ రావణ్ కు మరో షాక్- గన్నవరం కోర్టు కీలక ఆదేశం..!
విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఉపా కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రావణ్ (Prasna ravan)కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ పై నెల్లూరు జైల్లో ఉన్న రావణ్ ను ఇవాళ గన్నవరం కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు వర్చువల్ గా హాజరుపర్చారు. పోలీసులు రావణ్ రిమాండ్ పొడిగింపు కోరగా.. రావణ్ న్యాయవాదులు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు మాత్రం రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ ను తొలుత పిఠాపురం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అయితే ఆయన్ను పిఠాపురం తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపర్చాక బెయిల్ లభించడంతో వరుసగా కాకినాడ, బందరు, అనకాపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టుల్లో హాజరుపర్చారు. అయితే అన్ని చోట్లా రావణ్ కు బెయిల్ లభిస్తుండంతో కేసులు మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (UAPA) కింద కేసు పెట్టారు. ఈ కేసులోనే గన్నవరం కోర్టు ఆయన్ను రిమాండ్ కు పంపింది.

అయితే రెండు వారాల రిమాండ్ పూర్తి చేసుకున్న తర్వాత రావణ్ విడుదలకు న్యాయవాదులు ప్రయత్నించినా.. పోలీసులు మాత్రం అతని విడుదలను వ్యతిరేకిస్తుండటంతో గన్నవరం కోర్టు ఈ మేరకు రిమాండ్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో రావణ్ మరికొంతకాలం జైల్లో మగ్గక తప్పదు. మరోవైపు తనపై దాఖలైన కేసులన్నీ కొట్టేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రావణ్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దీనిపై విచారణ జరిగితే ఊరట దక్కుతుందని రావణ్ లాయర్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications