జగన్ బెయిల్ రద్దు: 10రోజులే గడువు -ఏపీ సీఎం, సీబీఐకి కోర్టు టైమ్ -ఏపీలో వ్యాక్సిన్లపై ఎంపీ రఘురామ బాంబు
సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ప్రయత్నాల అప్డేషన్లను వెల్లడించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం కీలక విచారణలు జరిగాయి. బెయిల్ రద్దు అంశంపై సీఎం జగన్ ఎట్టకేలకు స్పందించారు. తన లాయర్ ద్వారా కోర్టు దృష్టికి కీలక అంశాలను తెలియపర్చారు. అదే సమయంలో సీబీఐ సైతం తన అభ్యర్థనను కోర్టు ముందుంచింది..

రఘురామ పిటిషన్ విచారణ
క్విడ్ ప్రోకో వ్యవహారాలకు సంబంధించి మొత్తం 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కేసులను ప్రభావితం చేస్తున్నారని, ఏడాదిన్నరగా విచారణకు హాజరుకాక పోగా సహ నిందితులకు ప్రభుత్వంలో, పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడం, దర్యాప్తు సంస్థ సీబీఐకి చెందిన కొందరు అధికారులకు ఖరీదైన గిఫ్టులు, ఫ్లాట్లు కొనివ్వడం లాంటి ప్రలోభ కార్యక్రమాలూ కొనసాగిస్తున్నందున వెంటనే బెయిల్ రద్దు చేసి, అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతంచేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. గత వారం పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు శుక్రవారం దానిపై విచారణ జరపగా,

సమయం కోరిన సీఎం, సీబీఐ..
బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు నోటీసుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, దర్యాప్తు సంస్థ సీబీఐ తరఫు న్యాయవాదలు ఇవాళ విచారణలో పాల్గొన్నారు. బెయిల్ రద్దు అంశంలో కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అదే సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది సైతం.. తమకు ఢిల్లీ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నందున కౌంటర్ దాఖలుకు సమయం పడుతుందని విన్నవించారు. ఇద్దరి విన్నపాలను పరిశీలించిన సీబీఐ కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై పిటిషనరైన ఎంపీ రఘురామ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్ బెయిల్ రద్దు అంశంతోపాటు ఏపీలో కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీపైనా రఘురామ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

అసలే ఆలస్యం.. మళ్లీ గడువు..
''సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నేను వేసిన పిటిషన్ ను చాలా మంది తేలికగా తీసుకున్నారు. కానీ వాస్తవం మరోలా సాగుతోంది. గత విచారణలో మే7న రిప్లై ఇవ్వాలని కోర్టు ఆదేశించగా, జగన్, సీబీఐ తరఫు లాయర్లు తమకు ఇంకా సమయం కావాలని కోరారు. బహుశా కరోనా విపత్తు నిర్వహణలో బిజీగా ఉన్న కారణంగా సీఎంకు తీరిక లేదేమో. సీబీఐ వాళ్లేమో ఢిల్లీ నుంచి కొన్ని క్లియరెన్సులు రావాల్సి ఉందన్నారు. మొత్తానికి బెయిల్ రద్దు కేసును సీబీఐ కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. ఈసారి కూడా కౌంటర్ వేయకుండా జగన్ వాయిదా కోరతాడా లేదా చూడాలి. అసలే జగన్ విచారణకు రావడంలేదని కేసు వేస్తే, మళ్లీ దానిపైనా గడువులు కోరడం విడ్డూరంగా ఉంది. ఇలాగే రెండు మూడుసార్లు అలానే వ్యవహరిస్తే జడ్జిగారు తీర్పు ఇచ్చేసే అవకాశాలూ లేకపోలేవు. ఈలోపు..

ప్రధాని మోదీ చెంతకు సీఎం..
బెయిల్ రద్దు కేసు ఈనెల 17కు వాయిదా పడగా, ఈలోపు ఏసీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవబోతున్నట్లు సమాచారం. అయితే ఆయన వెళ్లేది వ్యాక్సిన్ల కోసమని తెలిసింది. ఏపీలో కొవిడ్ పరిస్థితుల నిర్వహణలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అధ్వాన్నంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామంటోన్న జగన్.. ఆ మేరకు 14 లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టారట. కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్ల కోసం ప్రధానిని కలవబోతున్నారట. ఆయన ఎంతసేపూ సజ్జల, సుబ్బారెడ్డి లాంటివాళ్లతోనే తప్ప ప్రజాప్రతినిధులతో కొవిడ్ గురించి మాట్లాడిన పాపానపోలేదు. సీఎం చెబితే తప్ప మంత్రులూ కదల్లేని పరిస్థితిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఇప్పటికైనా బయటికొచ్చి, రెండు రోజులకు ఒక ఆస్పత్రినైనా పరిశీలిస్తూ, ఆక్సిజన్ కోసం వార్ రూమ్ లాంటిది ఏర్పాటు చేయాలి. ఇదంతా ఒక ఎత్తయితే..

వైసీపీ వాళ్లకే వ్యాక్సిన్లు ఇస్తారట..
ఏపీలో వ్యాకసినేషన్ ప్రక్రియకు సంబంధించి నాకు కొన్ని అనూహ్య విషయాలు తెలిశాయి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తిస్తూ, టీకాల పంపిణీలో వారికే ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సీఎంవో నుంచి ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటోన్న ప్రైవేటు జగనన్న సైన్యాలైన గ్రామ వాలంటీర్లను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి, వ్యాక్సిన్లు ఇవ్వబోతున్నారట. సదరు వాలంటీర్లు ఆయా గ్రామాల్లో ఇతర పార్టీ వాళ్లను తప్పించి, కేవలం వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్లకు మాత్రమే తొలుత టీకాలు పింపిణీ చేసేలా స్కెచ్ వేశారని తెలిసింది. నిజంగా సాధారణ ప్రజలు ఎవరికైనా టీకాల విషయంలో అన్యాయం జరిగితే.. ఈ వాలంటీర్లను పట్టుకుని చితకొట్టాలని, దేహశుద్ధి చేయాలని నేను పిలుపునిస్తున్నా. వాళ్లేమీ ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి కొడితే నేరం కాబోదు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాను'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications