ఢిల్లీకి వెళ్లొచ్చు, ఎపిలో తిరుగొచ్చు: జగన్కు అనుమతి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఊరట లభించింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే నిబంధనను కోర్టు సడలించింది. ఢిల్లీకి వెళ్లి రావడానికి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించవచ్చునని కోర్టు తెలిపింది. గత నెల 23వ తేదీన జగన్కు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించింది. ఇప్పుడు ఆ షరతును సడలించింది.
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నానని, ఎన్నికలు సమీపిస్తున్నందున తాను రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంటుందని, అలాగే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఢిల్లీకి వెళ్లి రావాల్సి ఉంటుందని చెబుతూ తన రాజకీయ కార్యకలాపాల నిర్వహణకు షరతును సడలించాలని, రాష్ట్రంలో పర్యటించడానికి, ఢిల్లీ వెళ్లి రావడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్ జగన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అదే వాదనను ఆయన తరఫు న్యాయవాది వినిపించారు.
అయితే, జగన్ పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించింది. జగన్ విడుదల కావడం వల్ల సాక్షులు బెదిరిపోతూ ముందుకు రాని పరిస్థితి ఉందని సిబిఐ వాదించింది. ఢిల్లీకి వెళ్లి రావడానికి, రాష్ట్రంలో పర్యటించడానికి అనుమతి ఇస్తే కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందని సిబిఐ వాదించింది. ఎక్కడికి వెళ్తున్నదీ రెండు రోజుల ముందు తమకు తెలియజేయాలని సిబిఐ కోర్టు జగన్ను ఆదేశించింది. అదే విధంగా ఫోన్ నెంబర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ప్రతి వాయిదాకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించింది.
అయితే, కోర్టు జగన్ వాదనతోనే ఏకీభవించింది. దీంతో ఢిల్లీకి వెళ్లిరావడానికి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి కోర్టు జగన్కు అనుమతి ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాదుకే పరిమితమైన వైయస్ జగన్ ఇక ముందు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయి.