వైసీపీలో ఎంట్రీకి సీబీఐ మాజీ జేడీ రెడీ..! నియోజకవర్గం ఫిక్స్: జగన్ వైపే వారి చూపు.. కేసులపై ఇలా ..!
ఏపీలో కొత్త రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో గత ఎన్నికల్లో కలిసి పని చేసి..జనసేన వీడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త రాజకీయ వేదిక వైపు చూస్తున్నారు. జనసేన నుండి విశాఖ లోక్ సభ స్థానానికి మాజీ జేడీ పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తరువాత జనసేనలో ఉంటూ రాజకీయంగా మాత్రం క్రియాశీలకంగా లేరు.
ఇక, స్వచ్చంద సంస్థ ద్వారా ప్రధానంగా రైతుల సేవల పైనా ఫోకస్ చేసిన ఆయన..కొంత కాలంగా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కరోనా సమయంలో ప్రధాని మోడీ సేవలను ఆయన అభినందించారు. దీంతో..ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే, దీనిని లక్ష్మీనారాయణ ఖండించారు. ఇదే సమయంలో ఆయన వైసీపీ గరించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
నాడు జేడీ హవా..నేడు జగన్ హయాం...
సీబీఐ జేడిగా ఉన్న సమయంలో లక్ష్మీ నారాయణ..జగన్ పైన కేసులు నమోదు..విచారణ..ఛార్జ్ షీట్లు దాఖలు వరకు అన్నీ దగ్గర ఉండ పర్యవేక్షించేవారు. ఆ సమయంలో ఆయన టీడీపీకి మద్దతుగా నిలిచే పత్రికలకు జగన్ కేసుల విచారణ వివరాలను లీక్ చేసే వారని..జగన్ పైన ద్వేషంతో వ్యవహరిస్తున్నారని అప్పట్లో విమర్శించేవారు.
ఇక, లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల సమయంలోనే రాజకీయల్లోకి వచ్చి.. టీడీపీ నుండి పోటీ చేయాలని భావించారని టీడీపీ నేతలే చెప్పుకొచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో లక్ష్మీనారాయణ టీడీపీ నుండి పోటీ చేస్తే..అప్పటికే తన పైన కక్ష్య సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేశారని జగన్ అండ్ కో ప్రచారం సాగించింది. ఆ సమయంలో సీబీఐ జేడీ టీడీపీ నుండి పోటీ చేస్తే..అది జగన్ కు అనుకూలంగా మారుతుందనే ఆలోచనతో టీడీపీ నేతలే ఆయనను మరి కొంత కాలం వేచి చూడాలని సూచించారు.
ఇక, 2019 ఎన్నికల సమయంలో కొత్త పార్టీ అని..బీజేపీ అని మరోసారి..లోక్ సత్తా అంటూ మరొక సారి ఇలా అనేక తర్జన భర్జనల తరువాత ఆయన జనసేనలో చేరి అనూహ్యంగా విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. గాజువాక నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. ఆ తరువాత పవన్ తిరిగి సినిమాల్లోనూ నటించాలనే నిర్ణయంతో మాజీ జేడీ జనసేన వీడి బయటకు వచ్చారు. ఇక, అప్పటి నుండి ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం మొదలైంది.
వైసీపీని తప్పుబట్టలేం..చేరితే చెప్పే వస్తా..
తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన నుండి బయటకు వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదని..అదే సమయంలో ప్రస్తుతం స్వచ్చంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక,వచ్చే ఎన్నికల నాటికి మాత్రం తాను రాజకీయ పార్టీ నుండే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశారు.
ప్రధాని చేస్తున్న మంచి పనులను తాను అభినందించటం మినహా..బీజేపీతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయ పార్టీగా ఉందని..ఆ పార్టీ విధానాలను తప్పు బట్టాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీలో చేరే అవకాశం మాత్రం ఆయన కొట్టి పారేయలేదు. తాను వైసీపీలో చేరితే ముందుగానే చెప్పే చేరుతానంటూ పరోక్షంగా తాను వైసీపీ ఆప్షన్ సైతం ఓపెన్ గా ఉంచుకున్నట్లుగా కనిపిస్తోంది. మాజీ జేడీ విశాఖ నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసినా..అటు టీడీపీ ఇటు వైసీపీ నుండి మాత్రం రాజకీయంగా పెద్దగా విమర్శలు రాలేదు.
అయితే, అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ కరోనా ఎదర్కొనే విషయంలో కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను మాజీ జేడీ సమర్ధించారు. కరోనా పైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు విమర్శించినా.. లక్ష్మీనారాయణ మాత్రం మద్దతు ప్రకటించారు.
విశాఖ నుండే మరోసారి పోటీకి సిద్దం..
వచ్చే ఎన్నికల్లో తాను మరో సారి ఎంపీగానే పోటీ చేస్తానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరోక్షంగా తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన తనకు మూడు లక్షల ఓట్లు వచ్చాయని..విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తన భవిష్యత్ స్థానం తేల్చి చెప్పారు. వైసీపీలోకి వచ్చేందుకు పరోక్షంగా సంసిద్దత వ్యక్తం చేసిన లక్ష్మీనారాయణ తనకు విశాఖ ఎంపీ సీటు కావాలనే విషయాన్ని ఇప్పటి నుండే ఇంజెక్ట్ చేయటం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
అయితే, జగన్ పైన కేసులు పెట్టి..విచారించిన లక్ష్మీనారాయణ పైన వైసీపీ నేతలు..కేడర్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. అయితే, గతంలోనూ జగన్ తో పాటుగా వైయస్సార్ పైన తీవ్ర విమర్శలు..వ్యాఖ్యలు చేసిన వారు సైతం ఇప్పుడు వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్నారు.
Recommended Video
వైసీపీ కేడర్ రియాక్షన్ ఏంటి..?
లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా నాడు జగన్ ను విచారణ చేసి..అరెస్ట్ చేసిన అధికారి కావటంతో.. ఇప్పుడు ఆయనే వైసీపీలోకి వస్తే కేసుల పరంగా వైసీపీ కోరుకుంటున్న విధంగా క్లీన్ వే అక్కడి నుండే మొదలవుతుందనే వాదన ఉంది. అయితే, జూపూడి ప్రభాకర్ లాంటి వారిని పార్టీలోకి తిరిగి ఆహ్వానించటాన్ని జీర్ణించుకోలేక పోయిన పార్టీ కేడర్..జేడీ విషయంలో మాత్రం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరమే. అయితే, నాడు అధికారిగా కోర్టుల సూచన మేరకు తాను పని చేశానని..ఇప్పుడు జగన్ కేసుల గురించి తనకు ఆసక్తి లేదని లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. అయితే, టీడీపీ నుండి వ్యక్తం అయ్యే స్పందన సైతం మాజీ జేడీ విషయంలో కీలకం కానుంది.