Vande Mataram: రాష్ట్రపతి ఆమోదం, చట్టంగా మారిన కొత్త బిల్లు! జనగణమనతో సమానంగా ..
స్వాతంత్ర్య సమరంలో కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి ఆవేశాన్ని నింపిన 'వందేమాతరం' గేయానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత చట్టపరమైన రక్షణ కల్పించింది. జాతీయ గీతం 'జనగణమన'కు ఏ స్థాయిలో గౌరవం, చట్టపరమైన రక్షణ ఉందో.. ఇకపై జాతీయ గేయం 'వందేమాతరం'కి కూడా అదే స్థాయి చట్టభద్రత లభించనుంది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన 'జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026'కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ కొత్త సవరణ చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. ఇకపై వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, అది పాడుతున్నప్పుడు అడ్డంకులు సృష్టించినా తీవ్రమైన శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
రాష్ట్రపతి ముద్రతో రూపుదిద్దుకున్న చట్టం
1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి కేంద్రం ఈ నూతన సవరణలు చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వందేమాతరం గేయానికి ఇకపై సంపూర్ణ చట్టపరమైన రక్షణ లభించింది. గతం నుంచి జాతీయ గీతానికి అందుతున్న గౌరవాన్ని, నిబంధనలను ఇకపై వందేమాతరానికి కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ఠను, జాతీయ చిహ్నాలను కాపాడుకోవడంలో ఇది మరో చారిత్రాత్మక ఘట్టమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

పార్లమెంట్ వేదికగా రాజకీయ కాక
ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. శశి థరూర్, కనిమొళి వంటి ప్రతిపక్ష నాయకులు సభలో, సామాజిక మాధ్యమాల్లో తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య వ్యవస్థకు, లౌకికత్వానికి విరుద్ధంగా ఉందంటూ డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. గతంలో రాజ్యాంగ పరిషత్ కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారికంగా గుర్తించిందని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని చరణాలను నిర్బంధం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
సాంకేతిక సమస్యలు వర్సెస్ జాతీయ గౌరవం
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ చట్టం అమలులోని ఆచరణాత్మక ఇబ్బందులను లేవనెత్తారు. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర గీతాలను కూడా పూర్తిగా ఆలపిస్తే.. ప్రేక్షకులు ప్రతి సభకు ముందు, తర్వాత దాదాపు 12 నిమిషాల పాటు నిలబడాల్సి వస్తుందని, ఇది ఎంతవరకు సాధ్యమని ఆయన ప్రశ్నించారు. చట్టాల ద్వారా బలవంతంగా దేశభక్తిని, సహనాన్ని రప్పించలేమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తీవ్రంగా ఖండించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వందేమాతరానికి ఇవ్వాల్సిన తగిన ప్రాధాన్యతను, గౌరవాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాయని, అందుకే తమ ప్రభుత్వం ఈ చారిత్రక సవరణను తీసుకొచ్చిందని సభలో సమర్థించుకున్నారు.




Click it and Unblock the Notifications