వివేకా హత్య కేసులో సీబీఐ కీలక పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2019 మార్చి 19వ వివేకా తన ఇంట్లోనే హత్య చేయబడ్డారు. ఈ కేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అతని బెయిల్ ను రద్దుచేయాలని సీబీఐ కోరుతోంది. బెంగళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ లో జరిగిన ఆర్థిక లావాదేవీలవల్ల హత్య జరిగిందని అప్రూవర్ గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా ఇంటివద్ద వాచ్ మెన్ గా పనిచేసిన రంగయ్య కూడా కీలక సమాచారం ఇచ్చారు. సీబీఐ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈ ఏడాది మార్చి 16న కొట్టేశారు. సాక్షులను ప్రభావితం చేసేలా ఎర్ర గంగిరెడ్డి ప్రవర్తన ఉంటుందనేదానికి సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో అతని బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది.
వివేకా హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీలో కాకుండా వేరే రాష్ట్రంలో కేసును విచారించాంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెలాఖరున దీనిపై కోర్టు తీర్పు వెలువరించబోతోంది. 2019లో హత్య జరిగినప్పటికీ ఇప్పటివరకు హంతకులు ఎవరు? అనేది తేల్చకపోవడంపై సునీత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ పులివెందుల ఇన్ ఛార్జి బీటెక్ రవితోపాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. వీటిని ఇద్దరూ నాయకులు ఖండించారు. సీబీఐతో విచారించాలంటూ వీరిద్దరు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.