చిట్ఫండ్ పేరిట డిపాజిట్లు: జగన్ పార్టీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు
విశాఖపట్నం: చిట్ఫండ్ పేరుతో ప్రజల నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేసిన రియల్టీ రంగంలోకి మళ్లించారన్న ఆరోపణలతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు చేశారు.
సీబీఐ అధికారుల ప్రకటన ప్రకారం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా వ్యాపారాలు కొనసాగిస్తున్న వెల్ఫేర్ గ్రూపునకు చెందిన 33 కంపెనీల కార్యాలయాలు, ఎండీలు, డైరెక్టర్ల ఇళ్లు మొత్తం కలిపి 82 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సంస్థ ఎండీ మళ్ల విజయప్రసాద్ ఇంట్లో రూ.44.9 లక్షల నగదుతో పాటు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా చిట్ఫండ్ పేరిట డిపాజిట్ల సేకరణ, నిబంధనలకు విరుద్ధంగా ఆ మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి రియల్టీలోకి మళ్లించారనే అభియోగాలపై కేసులు నమోదు చేయాలంటూ గతంలో జార్ఖండ్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు మళ్ల విజయప్రసాద్తోపాటు, డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లపై రెండు కేసులు నమోదు చేశారు.
ఆ కేసుల దర్యాప్తులో భాగంగా జార్ఖండ్తోపాటు బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వెల్ఫేర్ గ్రూపునకు చెందిన 33 కంపెనీల కార్యాలయాలతోపాటు అప్పటి ఎండీ, డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. సంస్ధ మాజీ డైరెక్టర్ ఇంట్లో రూ.16.8 లక్షల నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ.3 కోట్ల దాకా డిపాజిట్లు సేకరించి, గడువు ముగిసి ఏడాది కావస్తున్నా తిరిగి చెల్లించకపోవడంతో కృష్ణాజిల్లా గుడివాడలోని వెల్ఫేర్ సంస్థ కార్యాలయంపై బాధితులు బుధవారం దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాగా, సీబీఐ దాడులపై మళ్ల విజయప్రసాద్ స్పందించారు.
విలువలతో కూడిన జీవితం కొనసాగిస్తున్న తాను ప్రాణం పోయినా తప్పు చేయనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తమ సంస్థకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. డిపాజిట్దారులెవరైనా తమకు స్థలం కావాలని వస్తే 24 గంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు.