వదల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్యర్దులే టార్గెట్: నర్సాపురం అభ్యర్ది పై దాడులు..
ఏపిలోని రాజకీయ నేతలను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేతలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానంగా వైసిపి నేతలను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి నోటీసులు ఇచ్చిన సీబీఐ..ఇప్పుడు వైసిపి నుండి నర్సాపురం ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు నివాసంపై దాడులు కొనసాగుతున్నాయి.
వైసిపి ఎంపీ అభ్యర్ది నివాసం పై..
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ అభ్యర్దిగా వైసిపి నుండి పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు నివాసంపై ఉదయం నుండి సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఆయన బ్యాంకుల నుండి రుణాలు సేకరించి..తిరిగి చెల్లింపులో ఆయన సంస్థలు విఫలమయ్యాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించకపోవంతో గతంలో కేసు నమోదు చేసారు. ఇందులో భాగంగా ఎమ్మార్లో ఉన్న ఆయన నివాసం పైన సీబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు.

బెంగుళూరు నుండి ప్రత్యేక టీం ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం. రఘురామకృష్ణంరాజు గతంలో బిజెపిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బిజెపి నుండి టిక్కెట్ ఆశించి భంగ పడ్డారు. ఆ తరువాత టిడిపిలో చేరిన ఆయన, ఎన్నికల ముందు వైసిపిలో చేరి నర్సాపురం నుండి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావుకు ఆయన వియ్యంకుడు
టిడిపి నేతలను వీడని సీబీఐ
ఎన్నికల ముందు నుండి టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని సీబీఐ దాడులు చేస్తోంది. టిడిపిలో ఉన్న సమయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టిడిపి నేతలు బీదా మస్తాన రావు, గల్లా జయదేవ్, ఉగ్ర నరసింహారెడ్డి వంటి వారిపైన సీబీఐ దాడులు జరిగాయి. దీని పైన టిడిపి అధినేత ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం తమను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. పోలింగ్ ముందు రోజు వైసిపి గుంటూరు ఎంపి అభ్యర్ది మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆస్తుల పైనా సీబీఐ దాడులు జరిగాయి. ఇక, నాలుగు రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇక, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు పైన సీబీఐ దృష్టి పెట్టటంతో ఏపిలో రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది.












Click it and Unblock the Notifications