మిమ్మల్ని సెలవులపై ఎందుకు పంపించకూడదు?: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం తలంటు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠకు చుట్టుకుంది. తాము ఆదేశించినప్పటికీ.. ఏబీ వెంకటేశ్వరరావును ఎందుకు బదిలీ చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. దీనిపై సంతృప్తికర వివరణ ఇవ్వాలంటూ పునేఠను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి పునేఠా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో సమావేశం అయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఎందుకు జీవో జారీ చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు.

జీవోల వ్యవహారం పునేఠా మెడకు
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్న సమయంలో.. ఇంటెలిజెన్స్ బ్యూరో డీజీ ఏబీ వెంకటేశ్వర రావు, కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంల పనితీరుపై సందేహాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, వారిని బదిలీ చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ ముగ్గురి పనితీరుపై నివేదికలను తెప్పించుకున్న అనంతరం.. బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఇంటెలిజెన్స్ డీజీకి వర్తించబోవంటూ రాత్రికి రాత్రి ఓ జీవోను తీసుకొచ్చింది. అనంతరం ఏబీ బదిలీని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

హైకోర్టు ఆదేశించడంతో బదిలీ..
ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రతికూల తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోలేమని హైకోర్టు వెల్లడించింది. ఎన్నికల కమిషన్ పనితీరులో జోక్యం చేసుకోబోమంటూ స్పష్టం చేసింది. దీనితో ఏబీ వెంకటేశ్వర రావును ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించినప్పటికీ.. ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే బదిలీ చేయకుండా ఉండటమే కాకుండా.. తమను ధిక్కరించేలా జీవోను విడుదల చేయడం పట్ల మండిపడింది.

సీఎస్ కు సమన్లు
ఈ జీవోను విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. దీనితో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలుసుకున్నారు. కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠా జీవో నంబర్ 716ను జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ జీవోను రద్దు చేసి, తిరిగి ఏబీని అదే స్థానంలో కొనసాగింపజేస్తూ ఆ వెంటనే జీవో నంబర్ 720ని పునేఠా జారీ చేశారు. అలా ఎందుకు జరిగిందంటూ ఎన్నికల కమిషనర్ వివరణ కోరారు.

మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు:
మొదట్లో పునేఠ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పునేఠా సాంకేతిక కారణాలను చూపించి, ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని నిలిపివేయడానికి చర్యలు తీసుకున్నట్లు వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు పంపించకూడదంటూ ఆగ్రహించినట్లు చెబుతున్నారు. దీనితో పునేఠా- బదిలీని నిలిపివేయడానికి గల కారణాలను వివరించారని అంటున్నారు. కమిషన్ ఆదేశాలు వచ్చిన తక్షణమే తాము ఏబీ సహా ఎస్పీలు వెంకటరత్నం, రాహూల్ దేవ్ శర్మను బదిలీ చేస్తూ జీవో నంబరు 716 జారీ చేశామని పునేఠా వెల్లడించారు. తరువాత ఇంటెలిజెన్స్ డీజీని ఎన్నికల కమిషన్ పరిధిలోకి చేర్చకూడదంటూ రాష్ట్ర డీజీపీ తమకు నోట్ ఫైల్ పంపారని, దీని ఆధారంగా అదే స్థానంలో ఏబీని కొనసాగింపజేస్తూ జీవో 721 జారీ చేశామని పునేఠా వివరణ ఇచ్చుకున్నారు.

డీజీపీ ఏది చెబితే.. అదే చేస్తారా?
డీజీపీ నోట్ ఫైల్ పంపిన విషయాన్ని తమ దృష్టికి ఎందుకు తీసుకుని రాలేదని ఎన్నికల కమిషనర్ ప్రశ్నించింది. తమ అనుమతి తీసుకోకుండా బదిలీ ఉత్తర్వులను ఎలా రద్దు చేస్తారని పునేఠాను నిలదీసింది. డీజీపీగానీ, మరొకరుగానీ ఏది చెబితే అది చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఎలా సవాల్ చేస్తుందని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా జీవో ఇవ్వడం తొందరపాటు చర్యేనని, ఇకమీదట ఇలా జరగనీయబోమంటూ సీఎస్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications