ఏపీలో ఎన్నికల ముహూర్తంపై ఈసీ క్లారిటీ - కీలక ఆదేశాలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఏపీలో గత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్రం ఎన్నికల సంఘం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్దప్రాతిపదికన సిద్దం కావాలని ఆదేశించింది. పోలింగ్ ఎప్పుడనేది స్పష్టత ఇచ్చింది.
ఏపీలో ఈసీ టీం: ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు 18 జిల్లాల అధికారులతో సమీక్ష చేసారు. ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని సూచించారు. కీలక మార్గదర్శకాలు జారీ చేసారు. యుద్ద ప్రాతిపదకన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలన్నారు.

జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈసీఐ బృందానికి పరిస్థితులు వివరించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, విజయవంతంగా ఎలాంటి అవరోధాలు లేకుడా పూర్తి చేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక అవసరమన్నారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి: ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఐటీ వేదికలు ఉపయోగించుకోవాలని సూచించారు.రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం అధికారులను ఆరా తీసారు. క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.
మద్యం, డబ్బు అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేసారు. ఓటరు టర్నౌవుట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ల అమలుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్దేశించారు.
ఫిర్యాదులు పరిష్కరించండి: 2019 ఎన్నికల షెడ్యూల్ గురించి ప్రస్తావన చేసారు. అదే విధంగా ఈ సారి కొంత అటూ ఇటుగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని సూచన ప్రాయంగా వెల్లడించిందది. పార్లమెంట్ తో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో..అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని సీఈసీ టీం సూచించింది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications