రేపు రాజ్యసభకు సెలవు?: కేవీపీ బిల్లుపై మరో నాలుగు నెలలు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 5 శుక్రవారం ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్న ఏపీ ప్రజలకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతి రెండో శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రేపు రాజ్యసభ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 5(శుక్రవారం) ఉత్తరాదిన 'తీజ్' పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా వ్యాపారులు తమ వ్యాపార వృద్ధి కోసం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
కాబట్టి తీజ్ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించాలని ఉత్తరాది ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభకు సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరుగుందా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు దక్షిణాదిలో కూడా తొలి శ్రావణ శుక్రవారం.
రేపు రాజ్యసభకు సెలవు ప్రకటిస్తే మళ్లీ నాలుగు నెలలు తర్వాత జరిగే శీతాకాల సమావేశాల్లోనే కేవీపీ బిల్లుకు చర్చకు రానుంది. రాజ్యసభ సెలవుపై విషయమై డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత శుక్రవారం రాజ్యసభలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు వరుసగా రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలను అడ్డుకుని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రత్యేకహోదా అంశంపై సభలో ఏపీకి చెందిన ఎంపీలు తీవ్ర గందరగోళమే సృష్టించారు. ఈ నేపథ్యంలో కేవీపీ బిల్లును ఆగస్టు 5న చర్చకు తీసుకు వస్తామని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.