సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ - ప్రధాని కీలక నిర్ణయం..!!
ఏపీలో జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. ముఖ్యమంత్రి జగన్ వినుతల పైన ప్రధాని ఈ సారి వేగంగా స్పందించారు. సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా ఏపీకి దక్కాల్సిన బకాయిల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డిస్కమ్ ల నుంచి ఏపీకి బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఇదే అంశం పైన గతంలో పలు మార్లు కేంద్రానికి ఏపీ నివేదించింది. అయినా, స్పందన రాలేదు. తాజాగా..ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ సమయంలో చర్చించిన అంశాల పైన ఈ సారి పీఎంఓ వెంటనే స్పందించింది.

ప్రధానితో సీఎం జగన్ భేటీ తరువాత
ఏపీకి సంబంధించిన అంశాల పైన అధికారుల కమిటీకి బాధ్యతలు అప్పగించటంతో పాటుగా.. తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఈ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇందు కోసం 30 రోజుల సమయం కేటాయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్లకు ఏపీ జెన్కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు ఉండిపోయాయి. నీతి అయోగ్ సమావేశం.. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాలతో పాటుగా ప్రధానితో సీఎం సమావేశమైన అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి..పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు.

ఈ సారి వేగంగా స్పందించిన పీఎంఓ
గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ ఆదేశాలు జారీ చేసారు. ఏపీ జెన్కో సరఫరా చేసిన 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్కు సంబంధించి తెలంగాణ డిస్కమ్లు రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను ఏపీకి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2019 ఆగస్టు 19న జరిగిన ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కమ్లు ఒప్పుకున్నా డబ్బులు మాత్రం విడుదల కాలేదు.

30 గడువు నిర్దేశించిన కేంద్రం
ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల (ఆర్ఈసీ) నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5,625 కోట్ల రుణాలను ఏపీ జెన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయగలిగింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కోరింది. తెలంగాణ డిస్కమ్లు కేంద్రం నుంచి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద పొందుతున్న రుణాన్ని ఏపీ జెన్కో బకాయిలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

సీఎం జగన్ కు రిలీఫ్ గా మారనున్న నిర్ణయం
ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్కుమార్ సూచించారు. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ వాదిస్తోంది. ఈ నెల 22న సీఎం జగన్ ప్రధాని మోదీ..కేంద్ర ఇంధన శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఈ విషయం పైన పట్టుబట్టారు. దీంతో.. కేంద్రం నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆదేశాల పైన తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ ఆదేశాలు ఇప్పుడు పాలనా పరంగా.. రాజకీయంగా బిగ్ రిలీఫ్ గా మారనున్నాయి.












Click it and Unblock the Notifications