జగన్ ప్రభుత్వానికి కేంద్రం భారీ రిలీఫ్ : ఫలించిన ప్రయత్నాలు : ఆర్దికంగా అంగీకారం..!!
ఆర్దికంగా సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కొంత మేర ఉపశమనం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లభించింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పు కోసం ప్రభుత్వంలోని ముఖ్యులు ఢిల్లీ కేంద్రంగా భారీగా ప్రయత్నాలు చేసారు. ఎట్టకేలకు ఓపెన్ మార్కెంట్ నుంచి మరింత అప్పు తెచ్చుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి సాధించింది. మరో రూ.10,500 కోట్ల రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతిచ్చింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపింది.
కేంద్ర అనుమతితో ఏపీ ప్రభుత్వానికి ఊరట
రుణ సేకరణ కోసం ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి తాజా నిర్ణయంతో ఊరట కలగనుంది. కరోనా కారణంగా అప్పులు చేసినా..అవన్నీ పేదలకే పంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ సమయంలో కరోనా లేకున్నా..అప్పులు చేసారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా.. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి అనుమతిచ్చిన పరిమితి మేరకు ఇప్పటికే రుణ స్వీకరణ పూర్తయింది. అనుమతికి లోబడి.. చివరి విడతగా రూ.1,000 కోట్లను గత వారం రుణంగా తెచ్చుకుంది.
జగన్ ప్రభుత్వ సుదీర్ఘ ప్రయత్నాలతో..
దీంతో కేంద్రం విధించిన పరిమితికి చేరుకోవడంతో.. మున్ముందు రాష్ట్ర ఆర్థిక అవసరాలతో ప్రభుత్వంలోని పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి కొత్తగా అప్పుకు అవకాశం లభించటంతో కొంత ఉపశమనం లభించింది. ఈ అనుమతి కోసం కొద్ది రోజులుగా.. ఆర్దిక మంత్రి బుగ్గన తో పాటుగా ఆర్దిక శాఖ అధికారులు పలు మార్లు ఢిల్లీ వెళ్లారు. రుణ పరిమితి పెంపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అంతకుముందు సంవత్సరాల్లో అదనంగా తీసుకున్న రుణాల కోత నుంచి ఈ ఏడాది మినహాయించాలని కోరారు.
తాజాగా కేంద్ర నిర్ణయంతో మరో పది వేల కోట్లకు పైగా..
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో రూ.10,500 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబరు వరకు ఉన్న రుణ పరిమితిని పెంచినట్లయింది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్రం అప్పుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో తొలి తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగినట్లవుతుంది. ఇక, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రుణ సేకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. తమ ప్రతిపాదనలను ఆర్బీఐకి సమర్పించింది.
ఆర్దికంగా భారీ వెసులుబాటు కలిగిస్తూ..
దీంతో..ఈ రోజు ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,000 కోట్ల రుణం సమీకరించనుంది. 18 ఏళ్ల కాల పరిమితితో రూ.వెయ్యి కోట్లు, 20 ఏళ్ల గడువుతో మరో రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం రుణాల సేకరించే క్రమంలో కేంద్రం కొన్ని రుణ సేకరణ షరతులను అమలు చేస్తుంది. అందులో భాగంగా.. ఏటా రాష్ట్రం తన రుణ పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి వీల్లేదు. అయితే, ఏపీ గతంలోనే ఈ పరిమితిని దాటింది. ఆ మొత్తం విలువ రూ.17,923 కోట్లుగా తేలింది. అది మినహాయించగా.. కొత్తగా రుణ అర్హత రూ.33,668 కోట్లుగా తేల్చారు.
Recommended Video
కేంద్ర షరతులు అమలు చేయాల్సిందే..
ఇందులో నుంచి ఇతర రుణాల మొత్తం రూ.6,000.21 కోట్లు కోత పెట్టారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రుణ పరిమితిని రూ.27,668.68 కోట్లకు పరిమితం చేశారు. ఆ లెక్క ఆధారంగా తొలి తొమ్మిది నెలలకు రూ.20,751.51 కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్రం గతంలో అనుమతి ఇచ్చింది. ఆ పరిమితి మేరకు ఆగస్టు నెలాఖరు నాటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఇక, తాజాగా..కేంద్రం రాష్ట్ర రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో తొలి తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి పెరిగింది. ఇప్పుడు ఇది జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ రిలీఫ్ గా అధికారులు చెబుతున్నారు.