వైసీపీకి భారీ ఊరట: ఆదుకున్న బీజేపీ: చంద్రబాబుకు దారేది: టీడీపీ దుష్ప్రచారానికి చెక్
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. కేంద్ర ప్రభుత్వం అనుకోని రీతిలో ఆదుకుంది. ఒకరకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రచారానికి తెర దించినట్టయింది. అదే సమయంలో- వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీపై ఎదురుదాడి చేయడానికీ ఇది కారణమైంది. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే తమ కౌంటర్ అటాక్ను కూడా మొదలు పెట్టారు.

శ్రీలంకతో పోల్చుతూ..
రాష్ట్ర ఆర్థిక స్థితిని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీలంకతో పోల్చుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ చేసిన అప్పులే అత్యధికమని, ఏపీ కూడా శ్రీలంకలా కుప్పకూలిపోవడం ఎంతో దూరం లేదంటూ ప్రభుత్వంపై అటాక్ చేస్తోన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం సైతం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని చెప్పిందనే ప్రచారాన్ని టీడీపీ నాయకులు సాగిస్తోన్నారు.

చంద్రబాబు సైతం..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవే తరహా విమర్శలు చేయడంతో అటు జనసేన నాయకులు సైతం మరింత రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శల దాడులను తీవ్రతరం చేశారు. లక్షల కోట్ల రూపాయలను అప్పులుగా తెచ్చి, ప్రజలకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారంటూ ధ్వజమెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్ పాలన రాష్ట్రానికి శాపంలా మారిందని, చివరికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ అవినీతి చోటు చేసుకుందంటూ మండిపడ్డారు.

ఒక్కదెబ్బతో చెక్..
ఈ ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క దెబ్బతో చెక్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలకు అడ్డుకట్ట వేసింది. ఏపీ తీసుకున్న అప్పులు ఎంత అనేది పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఈ మూడేళ్లల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి 31వ తేదీ నాటికి 3, 98,903 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. ఏపీ కంటే తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ చేసిన అప్పులే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ లిఖితపూరకంగా మరీ వెల్లడించారు.

ఒక్క దెబ్బకు
తమిళనాడు-రూ.6.59, ఉత్తర ప్రదేశ్-రూ.6.53, మహారాష్ట్ర-రూ. 6.08, పశ్చిమ బెంగాల్-రూ. 5.62, రాజస్థాన్-రూ. 4.77, కర్ణాటక-రూ.4.61, గుజరాత్-రూ.4.02, తెలంగాణ-రూ. 3.12 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేశాయని నిర్మల సీతారామన్ వెల్లడించారు.నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన వైఎస్ఆర్సీపీని ఆదుకున్నట్టయింది. టీడీపీ చేస్తోన్న దుష్ప్రచారంపై ఎదురు దాడి చేయడానికి కావాల్సిన ఊతాన్ని ఇచ్చినట్టయింది.

బీజేపీతో స్నేహం కోసం
ఏపీ కంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అప్పుల్లో ముందంజలో ఉండటం.. వాటి గురించి చంద్రబాబు గానీ, ఆ పార్టీ నాయకులు గానీ ఒక్క విమర్శ కూడా చెయ్యకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎత్తి చూపుతున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరడానికి చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తోన్నారు. ఆరు లక్షలకు పైగా అప్పులు చేసిన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లల్లో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications