చంద్రబాబు, నారా లోకేశ్కు భద్రతపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్కు కల్పిస్తున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. జడ్ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పై ఇటీవల దాడులు జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
తమ నేతలకు భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హోంశాఖ.. గత సంవత్సరం నవంబర్ 4న చంద్రబాబు ర్యాలీలో రాళ్ల దాడిపై నివేదిక కోరింది. పర్యటనల సందర్భంగా చంద్రబాబు లోకేశ్కు భద్రత కల్పించాలని ఏపీ డీజీపీ, సీఎస్ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

ఈ మేరకు జులై 27న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులపై సీరియస్ అయినట్లు సమాచారం. కాగా, గత నవంబర్ నెలలో చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్ల దాడిలో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలాగే చేస్తే పాదయాత్రలు చేసేవారా? అని ప్రశ్నించారు.
ఇది ఇలావుండగా, తాజాగా, చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటనలో భాగంగా అంగుళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. లారీని రహదారికి అడ్డు పెట్టడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు లాఠీఛార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ అధికార పార్టీపై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications