చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖ రివ్యూ?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై జరుగుతున్న దాడి ప్రయత్నాలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయినట్లు సమాచారం. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను కేంద్రం కల్పిస్తోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పర్యటనలో బాబుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో కూడా దాడికి ప్రయత్నం జరిగింది. ఈ సంఘటనలపై కేంద్ర హోంశాఖ రివ్యూ చేసినట్లు తెలుస్తోంది.
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న హోం శాఖ
చంద్రబాబు పర్యటనల్లో తరుచుగా ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ డీజీపీని వివరణ అడిగినట్లు తెలుస్తోంది. అయితే డీజీపీ ఏం చెప్పారనేది తెలియరాలేదు. యర్రగొండపాలెం లో చంద్రబాబు భద్రతాధికారి కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు బలమైన గాయమైంది. దీనిపై ఎన్ఎస్జీ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పర్యటనల సమయంలో ఆయన భద్రతా ఏర్పాట్లను స్థానిక పోలీసులు చూస్తుంటారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దాడులు ఎలా జరుగుతున్నాయనేది హోంశాఖకు ఆశ్చర్యంగా మారింది.

ఇరుపార్టీలు ఎదురుపడకూడదు
రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతోంది. ఒక పార్టీపై మరోపార్టీ రెచ్చగొడుతున్న కారణంగానే గొడవలవుతున్నట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక పంపించింది. యర్రగొండపాలెంలో జరిగిన సంఘటనలో రెండు పార్టీలది తప్పుందని, తప్పు ఎవరిలో ఉన్నా దాడులు మాత్రం చంద్రబాబు వరకు వెళ్లకుండా ఆపటంలో లోకల్ పోలీసులు ఫెయిలయ్యారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది.
ప్రస్తుతం చంద్రబాబుకు 12 మంది 24 గంటల సెక్యూరిటీని ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబు భద్రతను మరింతగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు చంద్రబాబు ఎక్కడ పర్యటించినా అక్కడి లోకల్ పోలీసుల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. టీడీపీ, వైసీపీ పరస్పరం ఎదురుపడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను పోలీసు యంత్రాంగానికి అప్పగించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications