2029 కంటే ముందే ఎన్నికలు - ఢిల్లీ సంకేతాలు, ఏపీ అలర్ట్..!!
తాజా ఎన్నికలతో కేంద్రంలో..ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కేంద్రం - రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువు తీరాయి. తిరిగి 2029 ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, కేంద్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇదే సమయంలో జమిలి ఎన్నికల పైన నివేదిక సిద్దమైంది. వంద రోజుల్లోనే కేంద్ర కేబినెట్ ముందుకు ఈ సిఫార్సులు రానున్నాయి. పార్లమెంట్, రాష్ట్రం లో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో, పొలిటికల్ గా అలర్ట్ మొదలైంది.
జమిలి ఎన్నికలు
పార్లమెంట్ తో పాటుగా ఏపీలోనూ ఎన్నికలు జరగుతున్నాయి. 2019,2024లోనూ అదే జరిగింది. తిరిగి 2029లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ అంశం పైన కసరత్తు చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను తొలి వంద రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గం ఎదుట ప్రతిపాదించేందుకు కేంద్ర న్యాయశాఖ సిద్దం అవుతోంది. దీనికి ఆమోదం లభిస్తే కేంద్రంతో పాటుగా రాష్ట్రంలోనే ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు.

మంత్రివర్గంలో నివేదిక
దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనంటూ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటి ప్రతిపాదించింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కమిటీ పేర్కొంది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి.
15 పార్టీలు వ్యతిరేకించాయి. నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకకాల ఎన్నికలను నిర్ద్వంద్వంగా ఆమోదించారని నివేదిక పేర్కొంది. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా.. 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80 శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు.
ఒకే సారి ఎన్నికలు
ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. ఒకేసారి ఎన్నికల కోసం కోవింద్ కమిటీ నిర్దిష్ట సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తరువాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది.
తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని నివేదికలో తెలిపింది. అయితే, 2/3వ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలు కూడా తమ అంగీకారాన్ని ఇవ్వాలి. దీంతో..ఇప్పుడు ఈ సిఫార్సులకు ఆమోదం లభిస్తే...ఎన్నికల ప్రక్రియలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications