కేసీఆర్ నుంచి రూ.6500 కోట్లు ఇప్పిస్తాం ..! రాజ్యసభలో ఏపీకి కేంద్రం హామీ..
ఏపీ విభజన తర్వాత రాష్ట్రానికి వచ్చిన విద్యుత్ ఉత్పత్తి సంస్ధల నుంచి తెలంగాణ విద్యుత్ తీసుకుంది. ఇందుకు గానూ చెల్లించాల్సిన రూ.6500 కోట్ల బకాయిల్ని మాత్రం చెల్లించలేదు. దీనిపై ఏపీ ఎప్పటినుంచో పోరాడుతోంది. తొలుత తెలంగాణ సర్కార్ తో దీనిపై సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోవడంతో కేంద్రాన్ని ఆశ్రయించింది. అయితే కేంద్రం కూడా పట్టించుకోకపోవడంతో ఈ విషయం మూలనపడింది. ఈ తరుణంలో కేంద్రం ఇవాళ పార్లమెంటులో కీలక హామీ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్ చార్జీల కింద 6 వేల కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ ప్రభుత్వం బకాయిపడింది.

దీంతో ఏపీకి బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం ఏళ్ళ తరబడి జాప్యం చేస్తూ వస్తోంది. విద్యుత్ చార్జీల బకాయిల చెల్లించేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం పలుదఫాలు తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వాటా కింద విడుదల చేసే కేంద్ర పన్నుల నుంచి మినహాయించి తమకు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర విద్యుత్, ఆర్థిక శాఖలు పరిగణలోకి తీసుకున్నాయా...తీసుకుంటే ఈ బకాయిల చెల్లింపు ఎప్పటిలోగా జరుగుతుందని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
దీనికి మంత్రి ఆర్కే సింగ్ జవాబు ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయని, ఫలితంగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొందని తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయవలసిందిగా ఏపీని ఆదేశించిందన్నారు. ఏపీ సరఫరా చేసిన విద్యుత్ కు కొంతకాలం సక్రమంగానే చార్జిలను చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం తదనంతరం చెల్లింపులను నిలిపివేసిందన్నారు. ఫలితంగా తెలంగాణ చెల్లించవలసిన విద్యుత్ చార్జిల బకాయిలు 6 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయన్నారు.

బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల అధికారులతో పలుమార్లు చర్చలు జరిపిందని, కేంద్రం ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా చేసినందున తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని మంత్రి చెప్పారు. ఒక రాష్ట్రం బకాయిలు చెల్లించకుండా మొండికేసిన సందర్భంలో బకాయిల చెల్లింపు కోసం కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలపై న్యాయ మంత్రిత్వ శాఖతోను, ఆర్థిక మంత్రిత్వ శాఖతోను చర్చలు జరుపుతున్నామన్నారు. రాష్ట్ర పన్నులలో వాటా కింద తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి ఈ బకాయిల మొత్తాన్ని మినహాయించాల్సిందిగా ఆర్బీఐని కోరే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఆర్కె సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications