సీబీఐ లాంటి సంస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు: కేంద్రంపై నిప్పులు చెరిగిన బాబు
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పరిపాలన ఎలా ఉందంటే సీబీఐ లాంటి అత్యున్నత సంస్థ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో ఉందని ఆరోపించారు.
భ్రష్టు పట్టిస్తున్నారు..
మోడీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని, రాఫెల్ కుంభకోణంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్ ను అనధికారికంగా తప్పించారని ఆరోపించారు. ప్రధాని మోడీ వద్ద పని చేసే ఆస్థానాను కాపాడేందుకు సీబీఐ డైరెక్టర్ని మార్చే పరిస్థితికి వచ్చారని మండిపడ్దారు.
ఆ ముగ్గురు మాత్రమే..
సీబీఐ డైరెక్టర్గా ఎవరినైనా నియమిస్తే రెండేళ్ల వరకు కొనసాగించాలని, ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు కల్పించుకోకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజే.. ఈ ముగ్గురు కలిసి సీబీఐ డైరెక్టర్ని నియమిస్తారని.. ఏదైనా సమస్య ఉంటే ఆ ముగ్గురు మాత్రమే పరిష్కరిస్తారన్న విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పిందని చంద్రబాబు అన్నారు.
అవినీతిని, రాఫెల్ కుంభకోణంలో చిక్కుకుని..
ఆస్థానాను, ఆయన అవినీతిని, రాఫెల్ కుంభకోణంలో చిక్కుకుపోయిన మోడీ తన అవినీతిని కాపాడుకునేందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ను తీసేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి కూడా తెలియకుండా తీసేయడం ఏంటని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయమో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వైసీపీ, వైసీపీలతో.. బీజేపీ కుట్రలు..
ఏపీలో ఐటీ దాడుల గురించి చంద్రబాబు స్పందిస్తూ.. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తులపై ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, వైసీపీ, జనసేన భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని కాల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ఇలా ఉండగా,రాష్ట్రంలో స్వైన్ ప్లూ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్వైన్ ప్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం మూడు రోజులకు మించి ఉంటే డాక్టర్లను సంప్రదించి స్వైన్ ప్లూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వ్యాధి నివారణకు అవసరమైన మందులు, కిట్లు, మాస్క్లను అన్ని ప్రభుత్వాసుపత్రులలో సిద్ధంగా ఉంచామని సీఎం చంద్రబాబు తెలిపారు.