ఇలా ఐతే ఎలా?: పోలవరం నిర్మాణ జాప్యంపై కేంద్రం ఫైర్
న్యూఢిల్లీ: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా పంపినట్లు తెలిసింది. ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పనులు నత్తనడకన సాగుతున్నాయని, అంతేగాక పనుల్లో కూడా నాణ్యత లేదని కేంద్రం మండిపడింది. పోలవరం నిర్మాణం చేపడుతున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి నిర్మాణం పూర్తి చేసే సామర్థ్యం లేదని స్పష్టం చేసింది.
పనులు ఇలాగే నత్తనడనకన సాగితే 2019 వరకు కూడా పోలవరం నిర్మాణం పూర్తి కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. స్పిల్ వే పనుల్లో నాణ్యత లేదని, కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పనులు మరీ నత్తనడకన సాగుతున్నాయని పేర్కొంది. పనుల్లో నాణ్యతతోపాటు వేగం పెంచాలని ఏపీకి సూచించింది. స్పిల్ వేకు కొత్త టెండర్లు ఆహ్వానించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.