ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో షాక్...కీలక పథకానికి నిథులు నిలిపివేత:ముందే వార్నింగ్!
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రాల్లో అమలవుతున్న వాటర్షెడ్ల పథకం కు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేసింది. కొత్తగా మంజూరు అయిన వాటర్షెడ్లను రాష్ట్ర నిధులతో నడుపుకోవాలని కేంద్రం తేల్చి చెప్పేసింది.
కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇదే విషయం స్పష్టం చేసినా ఈ నిర్ణయం వల్ల ఎక్కువ నష్టపోనుంది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే!...అదెలాగంటే?...దేశవ్యాప్తంగా వాటర్షెడ్ల పథకం అమలవుతున్నా, ఈ పథకం మన ఎపిలో ఎక్కువగా సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల కొత్త వాటర్ షెడ్లు రాష్ట్రానికి రాకపోగా...ఈ పథకం కొరకు పనిచేస్తున్న సుమారు 800 మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే...

వాటర్ షెట్ల పథకానికి కేంద్రం నిథులు ఆపేయడం వల్ల ఇక కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడం, ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులు నిలిచిపోవడం ఇటు రాష్ట్రాన్ని అటు ఆ పథకం కింద పనిచేసే 790 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆరు విడతలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వాటర్ షెడ్లు మంజూరు కాగా ఇక ఏడో విడత కింద నూతన షెడ్లు మంజూరు కావడం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్రం నిర్ణయం ఆశనిపాతంలా మారింది.
2009 నుంచి 2014-15 వరకు...రూ.2,900 కోట్లతో 432 ప్రాజెక్టులు ఈ పథకం కింద కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పటివరకు మంజూరైన ప్రాజెక్టుల్లో 90 శాతం దాకా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు ఖాళీగా ఉండగా...మళ్లీ కొత్త ప్రాజెక్టులు మంజూరయితే వీరికి పని దొరుకుతుందని భావిస్తున్న నేపథ్యంలో తాము కొత్త పథకాలను మంజూరు చేయబోవడం లేదని కేంద్రం తాజాగా స్పష్టం చేసేసింది. ఈ విషయం వెల్లడవడంతోనే వీరిలో చాలామంది ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారని తెలిసింది.
వాటర్ షెడ్ల పథకం కింద సాధారణంగా ఒక్కో బ్యాచ్లో 56% నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ వర్క్స్(ఎన్ఆర్ఎం) పనులు చేపడతారు. ఇందులో బ్యాచ్ 1లో 95%, బ్యాచ్ 2 లో 90%, బ్యాచ్ 3లో 57%, బ్యాచ్ 4లో 44%, బ్యాచ్ 5లో 13% ఎన్ఆర్ఎంకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అమలులో ఉన్న బ్యాచ్-6 లో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభం కాగా ఈ బ్యాచ్కు నిధులు ఆపేయడంతో దాని మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి.
ఇక బ్యాచ్-1, బ్యాచ్-2, బ్యాచ్-3లకు సంబంధించిన వాటర్షెడ్లు నిర్వహణకు సంబంధించి ఇక సిబ్బందితో అవసరం లేకపోగా...బ్యాచ్ 4లో కూడా మరో 12 పనులు చేసేస్తే అక్కడ కూడా సిబ్బందితో అవసరం తీరిపోతుంది. ఇక బ్యాచ్ 5లో పూర్తిగా గిరిజన ప్రాంతానికి చెందిన వాటర్షెడ్ల కార్యక్రమాలు ఉండగా...నిబంధనల ప్రకారం ఇక్కడ కేవలం గిరిజన ప్రాంతాలకు చెందిన వారినే పనులకు నియమించుకోవాల్సిఉంది. ఈ క్రమంలో కొత్తగా పనులు ప్రారంభమైన ఆరో బ్యాచ్కు నిధులు ఆగిపోవడంతో ఇక ఆ బ్యాచ్ ప్రాజెక్టు పనులు కొనసాగే పరిస్థితి ఉండక పోవచ్చని తెలుస్తోంది.
పలు బ్యాచ్ ల వాటర్ షెడ్ల పనులు చాలావరకు పూర్తయిన క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో ఆ పథకం తాలూకూ సిబ్బందికి పనులులేకపోవడంతో వీరిని డ్వామా ఆఫీసుల్లోను, ప్రాజెక్టు ఏరియా కార్యాలయాల్లోను ఖాళీగా కూర్చోబెడుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో సుమారు 100 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు సైతం ఆపేశారని ...అందువల్ల త్వరలోనే తమ ఉద్యోగాలు పోవచ్చేమోనని ఆ వందమందితో పాటు మిగిలిన సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు.
ఇక ఈ విషయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల తీరును కూడా కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. కొత్త వాటర్షెడ్లు మంజూరు నిలిపేస్తామని కేంద్రం ఏడాది కిందటే హెచ్చరించినా...తదనుగుణంగా ఈ సిబ్బందిని ఇతర పనులకు సర్దుబాటు చేయడానికి ఆ శాఖ అధికారులు ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదని వారు దుయ్యబడుతున్నారు. ఈ సిబ్బందిని ఉపాధి హామీ పథకంలో వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా అధికారులు ఆ పని ఎందుకు చేయలేదో అర్థం కాని పరిస్థితి.
ఈ వాటర్షెడ్ సిబ్బందికి ఏడాదికి రూ. 1.20 కోట్లు వేతనాల రూపంలో చెల్లిస్తుండగా ఇక ఇప్పుడు ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక కొత్తగా వాటర్షెడ్ ప్రాజెక్టులను మంజూరు చేసేది ఉండదని, ఉపాధి హామీ పథకంలో భాగంగానే నీటి సంరక్షణ పనులూ చేపట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్నీ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసేసింది. అయితే ఎపి పరిస్థితి దృష్ట్యా కొత్తగా మరికొన్ని వాటర్షెడ్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినా కేంద్రం నుంచి మళ్లీ ఇదే సమాధానమొచ్చిందని తెలిసింది.












Click it and Unblock the Notifications