ఏపీకి 'ప్రత్యేక'ఊరట: రాజధానికి రూ.1000 కోట్లు, బాబుకు జైట్లీ ఫోన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కేంద్రం సహకరించేందుకు సిద్ధమని తెలిపింది. ఏపీ అభివృద్ధికి కీలకమైన రాజధాని, పోలవరం ప్రాజెక్టుల పైన కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంతో ప్రజలు షాకయ్యారు. అయితే, మంగళవారం కేంద్రం ప్రజలకు ఊరట ఇచ్చింది.
ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి తక్షణం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి చెప్పారు. ఈ రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేసినట్టు జైట్లీ తెలిపారని చెబుతున్నారు. రాజధాని నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబు గత కొద్ది రోజులుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఈ నేపథ్యంలో జైట్లీ ఇటీవల లోకసభలో ప్రతిపాదించిన బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవటం పట్ల చంద్రబాబు, ఏపీ రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రజలు కూడా ఆగ్రహం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో కేవలం వంద కోట్ల రూపాయలు కేటాయించటంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై చంద్రబాబు ఇటీవల టీడీపీకి చెందిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖా మంత్రి సుజనా చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణజైట్లీకి పరిస్థితిని వివరించారు.
ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన రాజధాని నిర్మాణానికి తక్షణం 1000 కోట్లు కేటాయించటంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జైట్లీ స్వయంగా సిఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ చెప్పారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కొత్త రాజధాని నిర్మాణానికి వెంటనే రూ.మూడు వేల కోట్ల కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. కొత్త రాజధాని నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన పంపించలేదు కాబట్టే బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ కారణం చేతనే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం కేంద్రానికి పంపించిన నివేదికలో కొత్త రాజధానికి రూ.మూడు వేల కోట్లు వెంటనే కేటాయించాలని కోరారు. వీటిని త్వరలో ఇస్తామని జైట్లీ చెప్పారు.
దీనికి కేంద్రం స్పందిస్తూ వెయ్యి కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర హైకోర్టును విభజించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా రాష్ట్ర హైకోర్టు నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పినట్లు తెలిసింది. మరోవైపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం తెలిపింది. ఇతరత్రా ప్రాజెక్టులు కలిపి ఓ ప్యాకేజీ కేంద్ర మంత్రివర్గ అజెండాలో ఉన్నట్లు చెప్పారు.