కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి భారీగా డీఏ పెంపు ?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్దమవుతోంది. ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండో కరవు భత్యం(డీఏ)ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో ఎన్నికల ఏడాదిలో ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడో వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది.
2023 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం రెండో కరవు భత్యం పెంపు ప్రకటించేందుకు సిద్దమవుతోంది. వచ్చే నెల లేదా నవంబర్ లో ఈ ప్రకటన రాబోతోంది. ఇందులో సాధారణంగా ఇచ్చే 3 శాతం కరవు భత్యానికి మించి ఎక్కువగా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో ఈ పెంపు ఉండొచ్చని సమాచారం.

ఇప్పటివరకూ వెలువడిన నివేదికల ప్రకారం ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 3 శాతం ఉండొచ్చని ఆశించినా అంతకంటే ఎక్కువే ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కనీసం 4 శాతానికి పైగానే కరవు భత్యం పెంచుతుందని ఆశిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 48 లక్షల ఉద్యోగులతో పాటు 68 లక్షల పెన్షనర్లకు సైతం ప్రయోజనం చేకూరే అవకాశముంది. ఈసారి డీఏ 4 శాతం పెంచితే మొత్తం డీఏ 46 శాతానికి చేరుకునే అవకాశముంది.
ప్రతీ ఏటా అప్పటి ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం ఉద్యోగులకు డీఏ పెంపును ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి 4 శాతం డీఏ ప్రకటిస్తారని భావిస్తున్నా, దేశంలో ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం ఉందని కేంద్రం స్వయంగా అంగీకరించినట్లు అవుతోంది. అయినా ఎన్నికల ఏడాది కావడంతో ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో కేంద్రం ఇవేవీ పట్టించుకోపోవచ్చని సమాచారం. ఈ డీఏ పెంపు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలవుతుంది.












Click it and Unblock the Notifications