మొండిగానే వెళ్తున్నాం: కేంద్రంపై చంద్రబాబు, జగన్కు పరిటాల హెచ్చరిక
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వంపై కాసింత అసహనం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రమైనా కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినా మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువును ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నీటి పరిరక్షణ.. ఉద్యమంగా సాగాలన్న సీఎం ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంతలు, పొలాల్లో పంటకుంటలు తవ్వుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత తమదే అని చంద్రబాబు వివరించారు.
టూరిజం అభివృద్ధి
శ్రీలంక తరహాలో ఆంధ్రప్రదేశ్లో టూరిజంను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లాలో ఐటీసీ హోటల్కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యుదయ రైతులకు జిల్లా పెట్టింది పేరన్నారు.
వ్యవసాయానికి గుంటూరు జిల్లా ఆదర్శమని కొనియాడారు. ఏపీలో టూరిజం అభివృద్ధికి ఐటీసీ సహకరించాలని కోరారు. బయట కంపెనీలు పెట్టుబడులతో వచ్చినప్పుడు నమ్మకమైన స్థానిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. గుంటూరులో వ్యాపార అవకాశాలు పుష్కలమని చెప్పారు.
జగన్ను ప్రజలు క్షమించరు: పరిటాల
అనంతపురం: డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని, అభివృద్ధిని చూసే తెలుగుదేశంలోకి చేరుతున్నారని మంత్రి పరిటాల సునీత తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్ తన తీరు మార్చుకోక కుటుంబసభ్యులు తప్ప పార్టీలో ఎవరూ మిగలరని, ప్రజలు కూడా క్షమించరని పరిటాల సునీత హెచ్చరించారు.