ఏపీకి మోడీ తీపి: రూ.2000ల కోట్లు, ప్రత్యేక హోదాపై తర్జనభర్జన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులను విడుదల చేసింది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం గురువారం నాడు దాదాపు రెండువేల కోట్ల నిధులను విడుదల చేసింది. అక్షరాలు రూ.1976 కోట్లు విడుదల చేసింది. మరింత మొత్తాన్ని త్వరలో విడుదల చేయనుంది.
ఆర్థిక లోటు భర్తీ కోసం కేంద్రం ఏపీకి రూ.1176 కోట్లు విడుదల చేసింది. వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఈ మొత్తాన్ని విడుదల చేసింది. వెనుక బడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.450 కోట్లు విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, కేంద్రం గత కొద్ది రోజులుగా ఏపీకి చేసే సాయం పైన తర్జన భర్జన పడుతోన్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో దానికి బదులు ప్రత్యేక హోదాను తలదన్నే ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది. ఇప్పుడు విభజన చట్టంలోని ఆర్థిక లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ పైన ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీకి హోదా ఇస్తే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, బీహార్ తదితర పదకొండు రాష్ట్రాలు కేంద్రం పైన తమకూ కావాలని ఒత్తిడి చేయనున్నాయి. కాబట్టి కొత్త రాష్ట్రమైన ఏపీకి.. ఆ రాష్ట్రాల నుంచి ఒత్తిడి లేని విధంగా ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
50 కోట్లతో ఏం చేయాలో కేంద్రమే చెప్పాలి: కొణతాల
ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం కేవలం రూ.50 కోట్లు ఇవ్వడం పైన మాజీ కేంద్రమంత్రి కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. రూ.50 కోట్లతో ఏం చేయాలో కేంద్రమే చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.