పోలవరానికి రూ.24వేల కోట్లు: పనులు జరగకపోతే కారణాలు చెప్పాల్సిందే
అమరావతి: కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తీపి కబురు పంపింది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి సుమారు రూ.24వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం చేసిన ఖర్చు చేసిన మొత్తంలో రూ.979.36కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడేళ్లలో..
ఈ ఏడాది రూ.3,500 కోట్లు, వచ్చే రెండేళ్లలో ఏటా రూ.9వేల కోట్ల చొప్పున కేటాయిచాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఏపీకి పలు మార్గదర్శకాలను సూచించింది. వాటిని పరిశీలిస్తే.. పనులు తగిన సమయంలో పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం(పీఎంయూ) ఏర్పాటు చేయాలి.
మార్గదర్శకాలు..
పోలవరం ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణకు సంబంధించిన మూడో పక్షంగా ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రానికి ఈ పనులపై ఒక నివేదిక సమర్పించాలి.
లక్ష్యాలకు అనుగుణంగా పని జరగాలి..
అంతేగాక, నిధుల విడుదలకు సంబంధించిన కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రాజెక్టు పనుల్లో లక్ష్యానికి అనుగుణంగా పురోగతి ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలవరం ప్రాజెక్టు అథారిటీ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ పనుల పురోగతి ఆశించినట్లు లేకపోతే అందుకు తగిన కారణాలు స్పష్టం చేయాలి.
నిధులు పెరగొచ్చు..
రానున్న కాలంలో పోలవరానికి మరిన్ని కేటాయింపులు పెరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోని నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం దీర్ఘ కాలిక నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా నాబార్డ్ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. తొలుత ఈ నిధికి బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించగా, నాబార్డ్ రుణ సహకారంతో అది రూ. లక్ష కోట్లకు చేరుకుంది. ఆ మేరకు అన్ని అన్ని ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 2019నాటికి పోలవరానికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.