రుషికొండకు జగన్ వెళ్లాలా వద్దా? హైకోర్టు ఆదేశాల వేళ కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇది న్యాయప్రక్రియలో చిక్కుకోవడంతో కనీసం తాను అయినా విశాఖ వెళ్లి అక్కడి నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖలోని రుషికొండపై భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడంతో పాటు వాటిలో కొన్నింటిని తన క్యాంపు కార్యాలయం, ఇతర ఆఫీసులకు కేటాయించడం కూడా జరిగిపోయాయి.
అయితే రుషికొండపై గతంలో ఉన్న పర్యాటక రిసార్టును కూల్చివేశాక అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయంటూ హైకోర్టులో దాఖలైన కేసుపై విచారణ తర్వాత ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు వచ్చాయి. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టులో రుషికొండపై ఉల్లంఘనలు జరిగినట్లు తేలడంతో హైకోర్టు తాజాగా కేంద్రానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్న కేంద్ర పర్యావరణ శాఖ రుషికొండ విషయంంలోనూ అలాగే వ్యవహరించాలంటూ మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ రాశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖకు మారేందుకు సీఎం వైఎస్ జగన్, అధికారుల కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కేంద్రం హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పందించి రుషికొండపై అదనపు కట్టడాలు కూల్చేసేందుకు సిద్ధమైతే ఏం జరుగబోతోందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసలే ఎన్నికల వేళ కేంద్రం తీసుకునే నిర్ణయాలు వైసీపీ సర్కార్ కు ఊరటనిస్తాయా లేక మరిన్ని ఇబ్బందుల్లోకి నెడతాయా అన్నది తేలాల్సి ఉంది.
రుషికొండపై నిబంధనల్ని ఉల్లంఘించి కట్టిన కట్టడాల విషయంలో కేంద్ర పర్యావరణశాఖ హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పందిస్తుందా లేక మరేదైనా కారణం చెప్పి ప్రస్తుతానికి తప్పించుకుంటుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. అలాగే ఎన్నికల వేళ రుషికొండపై జరుగుతున్న చర్చ స్ధానికంగా అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. ఏదైమైనా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం మాత్రం కచ్చితంగా సంచలనాలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications