వైసిపి పోరాటానికి అండగా ఉంటాం...దుర్గారావు మృతి బాధాకరం:చలసాని శ్రీనివాస్
విజయవాడ:వైసిపి రాష్ట్ర బంద్ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్త దుర్గారావు చనిపోవడం బాధాకరమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
దుర్గారావు మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందానన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం బంద్ నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చలసాని శ్రీనివాస్ చెప్పారు. వైసిపి చేపట్టిన బంద్ను ఇతర పార్టీలు కానీ, ప్రజలు కానీ ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయని చలసాని స్పష్టం చేశారు.

శాంతియుతంగా బంద్లు, దీక్షలు, ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చని...దానిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన ఈ సందర్భంలో పునరుద్ఘాటించారు.
గతంలో కూడా తాము దీక్షలు చేస్తామంటే చంద్రబాబు అనేక ఇబ్బందులు పెట్టారని చలసాని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నడి రోడ్డుపై దీక్షలు చేస్తే తప్పు లేదు కానీ, ఎవరైనా దీక్షలు చేస్తే పోలీసులచే అరెస్ట్ చేయిస్తున్నారని చలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి అందరం అండగా ఉంటామని, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ గా అది తమ బాధ్యతని చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. ఎపికి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications