పట్టణీకరణ సవాళ్లను విసురుతోంది, నాకు అద్భుత అవకాశం: చంద్రబాబు
ఢిల్లీ: పెరుగుతున్న పట్టణీకరణ అనేక సవాళ్లు విసురుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. జీడీపీలో అత్యధిక భాగం పట్టణాల నుంచే వస్తోందని చెప్పారు. భవిష్యత్తులో పట్టణాలలో 70% నుంచి 80% జీడీపీ వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో చంద్రబాబు బుధవారం కీలకోపన్యాసం చేశారు.
స్వచ్ఛభారత్ సబ్ గ్రూపు కన్వీనర్ గా పట్టణాభివృద్దికి కొన్ని నిర్మాణాత్మక సూచనలను చేశామని చెప్పారు. ఘనవ్యర్ధాలనుంచి విద్యుత్ ఉత్పత్తి అందులో ఒకటని వివరించారు. ఈ రోజు తనకు ఒక అద్భుత నగరం అమరావతిని నిర్మించే అవకాశం దక్కిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు తనను నమ్మి 33వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ కింద అందజేశారని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో నగరాలు ఏ విధంగా ఉండాలనే విషయంలో ప్రపంచానికే ఒక నమూనా నగరంగా అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని వ్యాఖ్యానించారు. పర్యావరణ హితమైన నగరంగా, నడిచివెళ్లి, సైకిల్ పై వెళ్లి, వాటర్ టాక్సీపై వెళ్లి పనులు చేసుకునేలా ఒక బ్లూ,గ్రీన్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.
ఇప్పటికే స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను ఏర్పాటుచేశామనీ, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులను సమీకరిస్తామని వివరించారు. ఈ కృషిలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా ఈ వేదికనుంచి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
లులూ గ్రూప్ ప్రతినిధులతో భేటీ
లులూ గ్రూప్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖలో రూ.1500 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ నెలకొల్పేందుకు లులూ గ్రూప్ ముందుకొచ్చింది. ఏపీలో పర్యటించి పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించాలని లులూ గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీని సీఎం చంద్రబాబు కోరారు. త్వరలోనే పర్యటిస్తానని చంద్రబాబుకు యూసుఫ్ అలీ హామీ ఇచ్చారు.