ఎన్ని కేసులంటే అంత భవిష్యత్ - పార్టీకి ఆర్దికంగా సాయం చేస్తే : జగన్ ది ఐరెన్ లెగ్ - చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం కొనసాగుతున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విశాఖలో ముఖ్య నేతలతో చంద్రబాబు పార్టీ పరిస్థితుల పైన ఆరా తీసారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. పని చేసే వారికే పదువలు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రజలతో ఉన్న వాళ్లకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని తేల్చి చెప్పారు. పార్టీలో ప్రజలు పెద్ద ఎత్తున చేరేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
2029 నాటికి దేశంలోని నెంబర్ వన్గా తీర్చి దిద్దాల్సిన ఏపీని సీఎం జగన్ నాశనం చేసారని విమర్శించారు. జగన్రెడ్డి చేస్తున్న అప్పులన్నీ మనమే కట్టాలని చెప్పుకొచ్చారు. పార్టీకి ఆర్దికంగా సహాయం చేసేవాళ్లకి పార్టీలో భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. పని తీరు..సామర్ధ్యం ఆధారంగా అవకాశాలు దక్కుతాయని స్పష్టం చేసారు. ఎవరూ కేసుల గురించి భయపడవద్దని.. ఎన్ని కేసులుంటే అంత భవిష్యత్ ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.
ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కేసులన్నీ పరిష్కరించేలా బాధ్యత తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. జగన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. గ్రామానికో రౌడీని, సైకోను తయారు చేశారని, సైకోలను పూర్తిగా అణచివేస్తామన్నారు. పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలని.. తనతో కాదన్నారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మనమేమి బాబాయిని చంపలేదు.. కోడి కత్తి డ్రామాలు ఆడలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఆ తరువాత రుషికొండలోని హరిత రిసార్ట్స్ పరిశీలనకు బయల్దేరిన సమయంలో.,.ఎండాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ ను ప్రాజెక్టు పేరుతో దురాక్రమణ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తనను అడ్డుకోవటం పైన చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. భీమిలి నియోజకవర్గంలో బాదుడే బాదుడే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు.