అసెంబ్లీకి చంద్రబాబు - అధినేతతో కలిసి గంటా : దూరంగా బాలయ్య..!!
టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్న తరువాత ఆయన..దూరంగా ఉంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం సీఎం జగన్ తొలిగా ఓటు వేసారు. ఆయన తరువాత స్పీకర్..మంత్రులు ఓటు వేసిన వారిలో ఉన్నారు. టీడీపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీకి
రాష్ట్రపతి ఎన్నికల్లో చివరి నిమిషంలో అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. విజయవాడలోని ఒక హోటల్ లో ముర్మును సత్కరించారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ముర్మును ఎంపిక చేసినందుకు ప్రధానిని సైతం అభినందించారు. ఇక, ఏపీలోని మొత్తం 175 ఎమ్మెల్యేల ఓట్లు ముర్ముకు అనుకూలంగా పోలవ్వనున్నాయి. అయితే, టీడీపీ ఎమ్మెల్యే గంటా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అది స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
చంద్రబాబుతో పాటుగా గంటా
ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కోసం ఆయన చంద్రబాబు తో పాటుగా అసెంబ్లీకి వచ్చారు. ఇక, పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు. ఆయన విదేశాల్లో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. సినీ హీరో..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ సైతం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో పాల్గొనలేదు. బాలయ్య విదేశాల్లో ఉన్నట్లుగా సమాచారం. ఇక, మందడం వద్ద అమరావతి రైతులతో చంద్రబాబు కొద్ది సేపు మాట్లాడారు. వారంతా రాజధాని తరలింపు పైన ఆందోళన వ్యక్తం చేసారు.
బాలయ్య - బుచ్చయ్య విదేశాల్లో
అమరావతి రాజధానిగా కొనసాగుతుందని.. అధైర్య పడవద్దంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. కాగా, రైతులు చంద్రబాబుకు ఆకుపచ్చ కండువా కప్పారు. రాజధాని తరలించే శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు వారితో చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించిన వైసీపీ..ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతిచ్చేందుకు సిద్దమైనట్లుగా సమాచారం. దీంతో..ఇప్పుడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతుగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ఉపరాష్ట్రపతికి మద్దతు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.