టీడీపీలో కోవర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?
ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ జరగిన రాత్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ ఇద్దరూ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు పోస్ట్ పోల్ సర్వేలు చేయించారు. సర్వే సంస్థలు అన్నీ టిడిపి గెలుస్తుందంటూ చెబుతున్నారు. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్దులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి..
చంద్రబాబు వరుస సమీక్షలు..
ఎన్నికల్లో ఒక వైపు తమదే విజయం అని చెబుతున్నారు. 150 ప్లస్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలు టిడిపికే మద్దతుగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే, ఇదే సమయంలో టిడిపి నుండి ఎన్నికల్లో పోటీ చేసిన 25 లోక్సభ స్థానాల అభ్యర్దులు..175 మంది అసెంబ్లీ అభ్యర్దులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. నియోకవర్గంలోని ప్రతీ బూత్లో జరిగిన పోలింగ్ వారీగా వివరాలు...సరళి..మహిళలు..వృద్దుల పోలింగ్ సరళి పైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల్లోనూ వెయ్యి శాతం గెలుపు తమదే అంటూ టిడిపి అధినేత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి డీలా పడవద్దంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అంత నమ్మకం ఏర్పడిన తరువాత ఇంకా బూత్ల వారీగా విశ్లేషణలు..సమీక్షలు ఎందుకన్నది కొందరు టిడిపి నేతల ప్రశ్న. ఫలితాల ముందుగానే పార్టీలో పోలింగ్ సందర్భంగా సమన్వయం..సహకారం ఎలా ఉందనే దాని పైనా చంద్రబాబు ఆరా తీస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆసక్తి కర వ్యాఖ్యలు..
పార్టీ అభ్యర్దులతో సమీక్ష సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు..కోవర్టులు అనే అనుమానం ఆయనకు ఎందుకు వచ్చిందని పార్టీ నేతలు ఇప్పడు చర్చలు చేస్తున్నారు. ఇక, కౌంటింగ్ ప్రక్రియ మగిసే వరకూ ప్రతీ అభ్యర్ది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ముందు ఇతర పక్షాలు కుట్రలు చేసే అవకాశం ఉందని బాబు వ్యాఖ్యానించారు. ఓట్లు ఇవియంల్లో ఉండగా.. ఇక కౌంటింగ్లో అన్ని పక్షాల ఏజెంట్లు ఉండే సమయంలో కుట్రలు ఏం జరిగే ఛాన్స్ ఉందని కొందరు అభ్యర్దులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పలువురు అభ్యర్దులతో అధికారులు ఏ రకంగా వ్యవహరించారనే దాని పైనా చంద్రబాబు ఆరా తీసినట్లు చెబుతున్నారు.
సమీక్షల వెనుక అసలు కారణం...
చంద్రబాబు వద్ద అన్ని నియోజకవర్గాల సమాచారం ఉందని పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే, అభ్యర్దులు మూడ్ తెలుసుకోవటానికి మాత్రమే ఈ సమీక్షలు ఏర్పాటు చేసారని అంచనా వేస్తున్నారు. హోరా హోరీ పోరుగా భావిస్తున్న వేళ..ఒక వేళ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా రెండు పార్టీలు వస్తే ఫిరాయింపులకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ సమీక్షలా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, వైసిపి వైపే ఓటర్లు మొగ్గు చూపారనే కింది స్థాయి ప్రచారంతో పార్టీలో ఎక్కడా నైరాశ్యం లేకుండా ఉండటం కోసమే అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారిలో దైర్యం నింపే ప్రయత్నం మినహా ఇందులో మరో ఉద్దేశం లేదని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కొందరు అభ్యర్దులు మాత్రం తమ సహచరులతో పోలింగ్ సరళిని ఉన్నది ఉన్నట్లుగా షేర్ చేసుకుంటున్నారు. వారు తమ వద్ద ఉన్న సమాచారం ముఖ్యమంత్రికి ఇస్తూనే..ఆయన వద్ద ఎటువంటి సమాచారం ఉందనే అంశం పై ఆసక్తి చూపిస్తున్నారు.