టీడీపీకి 110 సీట్ల పైమాటే : రేపు ఢిల్లీలో అఖిలపక్ష ధర్నా: చంద్రబాబు ధీమా లగడపాటేనా..!
ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టుకోవటంలో విఫలమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీకి 110 సీట్లు పైగానే వస్తాయని అది 120-130 వరకు వెళ్లవచ్చని చెప్పుకొచ్చారు. ఇక, వీవీ ప్యాట్స్ లెక్కింపు డిమాండ్ చస్తూ రేపు ఢిల్లీలో అఖిలపక్షం ధర్నా చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
వంద శాతం టీడీపీ ప్రభుత్వమే...
టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్తో డీలా పడిన పార్టీ నేతలకు బూస్టప్ ఇస్తున్నారు. తొలి నుండి చంద్రబాబు చెబుతున్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే, ప్రజల నాడి పట్టుకోవటంలో సర్వే సంస్థ లన్నీ విఫలమయ్యాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో..జాతీయ స్థాయిలోనూ తాము ఆశిస్తున్న ఫలితాలకు వ్యతిరేకంగా ఎగ్జిట్ ఫలితాలు రావటంతో చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. దీని ద్వారా పార్టీ నేతలు కౌంటింగ్కు సిద్దం కావాలని..ఏజెంట్లకు మరోసారి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక, ఏపీ ఫలితాల పైన మాట్లాడిన చంద్రబాబు..నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మైండ్ గేమ్తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రేపు ఢిల్లీలో అఖిలపక్ష ధర్నా..
ఏపీలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఖచ్చితంగా లోక్సభ సీట్లలోనూ 18 నుండి 20 వరకు గెలుస్తామంటూ చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. 110 అసెంబ్లీ స్థానాలతో మన గెలుపు ప్రారంభమవుతుందని, ఇది 120-130వరకూ వెళ్లొచ్చని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని... రేపు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని స్పష్టం చేసారు. వీవీ పాట్లు లెక్కించాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాన్నదారు చంద్రబాబు. అంతా అప్రమత్తంగా ఉండాలని... 22న కౌంటింగ్ ప్రక్రియపై అందరికీ మరోమారు శిక్షణ ఇవ్వాలని సూచించారు. వీవీ పాట్ల లెక్కింపులోను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
ధీమా వెనుక లగడపాటేనా..
దాదాపు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన తొమ్మది సంస్థలు వైసీపీకే అనుకూలంగా చెప్పాయి. లగడపాటి మాత్రం టీడీపికి అనుకూలంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు పోలింగ్ ముందు..పోలింగ్ నాడు..ఆ తరువాత లగడపాటి ఎప్పటికప్పుడు నివేదికలు అందించారు. లగడపాటి తన సర్వేలో సైతం మహిళలు టీడీపీ వైపే ఉన్నారని విశ్లేషించారు. ఇప్పుడు చంద్రబాబుతో సహా పార్టీ నేతలు సైతం ఆదే విషయాన్ని చెబుతున్నారు. సాయంత్రం నుండి సాగిన పోలింగ్ మొత్తం తమకే అనుకూలమన్నది టీడీపీ నేతల అంచనా. అయితే, అప్పటికే దాదాపు 72 శాతం వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చంద్రబాబు అంచనాలు...లగడపాటి లెక్కలు ఒకే రకంగా ఉండటంతో టీడీపీ నేతలు లగడపాటి సర్వే ఆధారంగా గెలుపు పైన ధీమాగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.