ఇక ప్రజల్లోనే చంద్రబాబు : టార్గెట్ సీఎం జగన్ - ఎన్నికలు : ఏడాది షెడ్యూల్ ఫిక్స్..!!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాను ముందుగా రంగంలోకి దిగుతున్నారు. ఇందు కోసం ఏడాది పాటు ప్రజల్లోనే ఉంటూ అనధికార ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రభుత్వం పైన యుద్దం ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో పర్యటన సాగేలా ఏడాది షెడ్యూల్ సిద్దం అయింది. అందులో భాగంగా.. ఈ నెల 15వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. ప్రతీ జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన సాగనుంది.

ప్రతీ జిల్లాలో మూడు రోజులు
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. పార్టీ పరిస్థితి.. నేతల మధ్య సమన్వం.. ప్రభుత్వం పైన పోరాటం.. కేడర్ - ప్రజలతో మమేకం అయ్యేలా కార్యాచరణ సిద్దం చేసారు. ప్రతి జిల్లాలో మూడేసి రోజులు ఉండనున్నారు. తొలి రోజు జిల్లా స్థాయిమహానాడులో పాల్గొంటారు. రెండో రోజు పార్లమెంటరీ సమీక్ష నిర్వహిస్తారు. మూడో రోజు 2 నియోజకవర్గాల్లో పర్యటన ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు. మొదటి రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ జిల్లా మహానాడు కార్యక్రమం ఉంటుంది. రెండోరోజు ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తారు. మూడోరోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షేత్ర స్ధాయి ప్రజా సమస్యల పరిశీలన చేయనున్నారు.

పార్టీ సమావేశాలు.. రోడ్ షో లు
ఆ సమయంలోనే రోడ్ షో నిర్వహిస్తారు. ఒక్కో పర్యటనలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించడం ద్వారా ఈ ఏడాదిలో మొత్తం ఎనభైకి పైగా నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇదే ఏడాది పార్టీ నలభై వసంతాల వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రెంటినీ పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో మహానాడు సమావేశాలు నిర్వహించనున్నట్లు మహానాడు వేదికగానే చంద్రబాబు ప్రకటించారు. ఈ పర్యటన ద్వారా కేడర్ లో ఉత్సాహం తీసుకురావటంతో పాటుగా.. నిత్యం ప్రజల మధ్యనే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు సభలు నిర్వహించనున్నారు.

టార్గెట్ జగన్ - ఉత్తరాంధ్ర నుంచి మొదలు
చంద్రబాబు లేదా లోకేష్ ఎన్నికల ముందు పాదయాత్ర .. బస్సు యాత్ర వంటివి చేపడతారనే చర్చ సాగింది. అయితే, అక్టోబర్ రెండో తేదీ నుంచి లోకేష్ మీ కోసం యాత్ర ప్రారంభం పైన కసరత్తు చేస్తున్నారు. దీని పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ముందుగానే చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు ఈ నెల 15వ తేదీన చోడవరంలో అనకాపల్లి జిల్లా మహానాడు సమావేశంలో పాల్గొంటారు. 16వ తేదీన అనకాపల్లిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఉంటాయి. 17వ తేదీన విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి సమస్యల పరిశీలన, రోడ్షోలు ఉంటాయి.












Click it and Unblock the Notifications