నేడు మళ్లీ ఢిల్లీ కి చంద్రబాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హస్తిన ప్రయాణం..!!
అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట్రపతిని కలిసిన అనంతరం మంగళవారం రాత్రే అమరావతి తిరిగివచ్చారు. అయితే రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు. ఆ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ రోజు బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దీనికోసం బుధవారం సాయంత్రం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని చంద్రబాబు ఉదయానికి మార్చిన విషయం తెలిసిందే..!
దీనితో పాటు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కూడా గురువారానికి వాయిదాపడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఈ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా యూపీ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ను అడ్డుకున్న వ్యవహారంపై చంద్రబాబు స్పందించారు. అఖిలేష్ పట్ల పోలీసు అధికారుల తీరును ఖండించారు. ఇక ఈ ఉదయం జరిగిని మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సత్వర అభివ్రుద్ది కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.