లోకేశ్కు చంద్రబాబు రూట్ మ్యాప్ - ఆ పొరపాట్లు జరగనీయద్దు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ కు రూట్ మ్యాప్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం దిశా నిర్దేశం చేసారు. గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా చూసుకోవాలని సూచించారు. నియోజవకర్గాల సమీక్షలో భాగంగా చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పైన సమీక్ష చేసారు. నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న లోకేశ్ క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అధినేతకు వివరించారు. తాజా సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పైన చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. సర్వేలు, ఇతరత్రా మార్గాల ద్వారా తన వద్దకు వచ్చిన సమాచారం పైన ఆరా తీసారు.
1983, 1985 లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిన విషయంలో ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. పొత్తుల కారణంగా నియోజకవర్గంలో టీడీపీ నష్టపోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను 2019 ఎన్నికల్లో ఓడిపోయినా, టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నా నియోజకవర్గంలోనే తాను పర్యటిస్తూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని లోకేష్ పార్టీ అధినేతకు వివరించారు. తాను సొంతంగా నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తాను సొంత నిధులతో 12 కార్యక్రమాలను ప్రజలకు మేలు జరిగేలా అందిస్తున్నానని లోకేష్ పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పారు.

ఈ పథకాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తుందని వివరించారు. గత ఎన్నికల్లో ఓటిమి గురించి ఆలోచన వద్దని, నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తూ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్దేశించారు. మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగరాయాలని సూచించారు. గెలుపు ఖాయమనే ధీమాతో ఎక్కడా అలసత్వం వద్దని హెచ్చరించారు. ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలను చైతన్యం చేయటంతో పాటుగా వారికి అండగా నిలవాలని మార్గనిర్దేశం చేసారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారీ మెజార్టీతో గెలుపొందేలా వ్యూహలు ఉండాలని చంద్రబాబు స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పార్టీ అధినేతకు గిఫ్ట్ గా ఇస్తానని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. దీంతో, మరోసారి లోకేష్ నియోజకవర్గం నుంచే పోటీ చేయటం అధికారికంగా ఖాయమైపోయింది. ఇప్పటికే వైసీపీ అక్కడ లోకేష్ లక్ష్యంగా కొత్త సమీకరణాలతో ఎన్నికలకు సిద్దం అవుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో మంగళగిరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications