2024లో ఓడితే వైసీపీ ఉండదు - జగన్ సింహం కాదు పిల్లి: మాటలు వక్రీకరించారు - చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ ఉండదని..ఈ విషయం జగన్ కు అర్దమైందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జగన్ సింహం కాదు పిల్లి అంటూ చంద్రబాబు ఎద్దేవా చేసారు. భయంతోనే అందరి కాళ్లు పట్టుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు చంద్రబాబు స్పష్టం చేసారు. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అని నినాదాలు చేశారు. కానీ.. జై జగన్ అన్నట్లు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా.. కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లుగా వక్రీకరించారని వివరించారు. ఇక, చిత్తూరు పర్యటన సమయంలో పొత్తులు రాజకీయాల్లో భాగమని చంద్రబాబు స్పష్టం చేసారు.

నాడు వైఎస్సార్ సైతం 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్.. వామపక్ష పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొన్న అంశాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. వైసీపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ సైతం పరోక్షంగా స్పందించటం.. చంద్రబాబు ముందకొస్తే స్పందిస్తామనే సంకేతాలు ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఏపీలో ఈ పొత్తుల వ్యవహారం పైనే పొలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా చర్చ సాగుతోంది. వైసీపీ నేతలు జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే... చంద్రబాబు -పవన్ తో పొత్తు పెట్టుకుంటున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications