కూటమిలో ఆ మగ్గురికి ఏమైంది - ఎందుకిలా..!!
ఏపీలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ కు సమయం సమీపిస్తోంది. గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. సర్వే సంస్థలు పోస్ట్ పోల్ లెక్కలతో తమ నివేదికలు సిద్దం చేస్తున్నాయి. విదేశాలు వెళ్లిన ముఖ్య నేతలు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్నారు. జగన్ తాను తిరిగి 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తానని ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మౌనం పై చర్చ మొదలైంది. అసలు కారణం పై పార్టీలో ఆసక్తిర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎన్నికలు పూర్తయి రెండు వారాలు అయింది. జగన్ ఇప్పటికే తమ అంచనాలు ఏంటో ఓపెన్ గా చెప్పారు. వైసీపీ నేతలు ఇంకా ఫలితాలు రాకముందే జగన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం..వేదిక ప్రకటించారు. ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కానీ, టీడీపీలో పూర్తిగా దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జగన్ తాను 151 గెలుస్తామని చెప్పినా...జగన్ మరోసారి ప్రమాణ స్వీకారమంటూ పార్టీ నేతలు హంగామా చేస్తున్నా..టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఫలితాల విషయంలో ఆ పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏంటా అని కేడర్ లో ఆందోళన మొదలైంది.

పోలింగ్కు ముందు వరకూ తామే అధికారంలోకి వస్తున్నామంటూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు బలంగా చెప్పుకొచ్చారు. కానీ, పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం ఆ జోష్ కనిపించటం లేదు.ఇన్ని రోజులుగా మౌనం వహించడం వెనుక వ్యూహమా లేక ఇంకేదైనా కారణం ఉందా అని చర్చించుకుంటున్నారు. ప్రధాని మోడీ నామినేషన్ సమయంలో వారణాసి వెళ్లినప్పుడు మాత్రమే ఓ ఇంగ్లీష్ చానల్తో మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అది మినహా ఇంకెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో ఎన్నికలు జరిగిన రోజు లేదా ఆ మర్నాడు పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొచ్చేవారు. కానీ, ఈసారి మాత్రం చంద్రబాబు చిన్నమాట కూడా మాట్లాడలేదు.
చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా గెలుపుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక పార్టీలో ఉన్న కొందరు నేతలు మాత్రం రాష్ట్రంలో జరగుతున్న రోజువారీ పరిణామాలపై ఈసీని లేదా డీజీపీని కలిసి ఫిర్యాదులు చేయడం మినహా ప్రభుత్వం ఏర్పాటుపై మాట్లాడటం లేదు. ఓవైపు అధికార పార్టీ తమకున్న అంచనాలతో వేగంగా ముందుకెళ్తుంటే తమ పార్టీ నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారో టీడీపీ కేడర్ లో టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీతో పాటు మిత్రపక్షంగా ఉన్న జనసేన,బీజేపీ నేతలు కూడా అసలు ఎన్నికలపై మాట మాత్రం మాట్లాడకపోవడం మరింత చర్చకు దారి తీస్తుంది. అయితే, ఇది వ్యూహాత్మక మౌనమా..లేక అంగీకారామా అనేది పార్టీ నేతలే స్పష్టత ఇవ్వాలి.












Click it and Unblock the Notifications