చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్... డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ...
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చింతమనేని ప్రభాకర్పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రేరేపిత పోలిసింగ్ నడుస్తోందని... ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేయడం సరికాదని అన్నారు.ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
అక్రమ నిర్బంధాలు,అరెస్టులతో పోలీసులు ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్దంగా పోలీసుల చర్యలు ఉంటాయని... చట్టవిరుద్దంగా నిర్బంధం ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వేధింపులకు గురిచేస్తారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో వివాహ వేడుకకు హాజరైన చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అశాస్త్రీయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పెట్రోల్,డీజిల్ ధరల పెంపుపై చింతమనేని ప్రభాకర్ నిరసన తెలియజేశారని... ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.దెందులూరు తహశీల్దార్కు వినతిపత్రమిస్తే తప్పుడు కేసులు పెడుతారా అని నిలదీశారు.

రాష్ట్రంలో నిత్యం హత్యలు,అత్యాచారాలు జరుగుతున్నాయని... ప్రజలు నిరంతరం అభద్రత భావంలో జీవిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతసేపు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం పైనే పోలీసులు దృష్టి పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకోవాలని... టీడీపీ నేతలపై తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చింతమనేని అరెస్ట్ :
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఆదివారం(ఆగస్టు 29) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్పోస్ట్ వద్ద ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వస్తున్న క్రమంలో ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీలో అనుమానాస్పద వాహనంలో చింతమేనిని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది.
Recommended Video
అంతకుముందు రోజు శనివారం(ఆగస్టు 28) పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ చింతమనేని ప్రభాకర్ ఎడ్ల బండి నడిపారు. దెందులూరు ఎమ్మార్వో కార్యాలయానికి ఎండ్ల బండిపై వెళ్తుండగా... అనుమతి లేదంటూ చింతమనేనిని పోలీసులు అడ్డగించారు.
ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట చోటు చేసుకుంది. చివరకు,ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్కు చింతమనేని ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ చింతమనేని ప్రభాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications