స్విస్ చాలెంజ్కు ఆమోదం: విమర్శలకు రిప్లై, సాక్షిని ఏకేసిన చంద్రబాబు
విజయవాడ: రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్పై వచ్చిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు. తాను సంతకం చేసిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం చేయకుండా తిప్పి పంపారంటూ వచ్చిన వార్తాకథనాలను ఆయన ఖండించారు. స్విస్ చాలెంజ్ను శుక్రవారం మంత్రివర్గం ఆమోదించింది.
తన అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విషయంలో పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లామని, ఏ విధమైన ఉల్లంఘనలు లేకుండా చూశామని చెప్పారు. వివాదాలు రాకూడదనే ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్విస్ చాలెంజ్లో ఎవరైనా పాల్గొనవచ్చునని, విస్తృతమైన ప్రచారం ఇస్తామని చెప్పారు. ప్రక్రియ 45 రోజుల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు.
Photos: వెలగపూడిలో ఎపి సచివాలయం
సింగపూర్ ప్రభుత్వ సంస్థలు అసెండా సింగ్బ్రిడ్జి, సెమ్కార్ట్ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్కు 1,691 ఎకరాలు అప్పజెప్పనున్నట్లు తెలిపారు.
అమరావతి డెవలప్మెంట్ కంపెనీ, రెండు సింగపూర్ కంపెనీలు కన్షార్షియంగా ముందుకు వెళ్తాయని చెప్పారు. మూడు దశల్లో భూమి అప్పగింత అభివృద్ధి జరుగుతుందని, మొదటి దశలో 200 ఎకరాలు అభివృద్ధికి ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా, 52 శాతం కన్షార్షియానికి ఉంటుందని చెప్పారు.
ఫేజ్-1లో ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున 200 ఎకరాలు ఇస్తాని, ఆ లాభాల్లో రాష్ట్రానికి వాటా ఉంటుందని అన్నారు. మొదటిసారి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తామని, క్యూబిక్ మీటర్కు రూ.500 చొప్పున ఇసుక సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పారు. సీడ్ కేపిటల్లో మౌలికవసతుల కంపెనీలు కల్పిస్తాయిని ఆయన అన్నారు. ఐకానిక్ భవనం కోసం 50 ఎకరాలు నామ మాత్రపు ధరకు ఇస్తామని, ఆ భూమిని మూడు దశల్లో కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.
అందరికీ ఆమోదయోగ్యమైన స్థలాన్నే రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చామని ఆయన అన్నారు. సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణానికి జపాన్ కంపెనీ ముందుకు వచ్చిందని, చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.
సచివాలయం నిర్మాణ స్థలిలో భూమి కుంగిపోయిందని వచ్చిన వార్తలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. సచివాలయం కూలిపోయిందని రాస్తారా అంటూ ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన సాక్షి మీడియాపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదుతో బంధాన్ని తెంచుకోలేక వేదనతో అమరావతికి వస్తున్న ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని సృష్టించడం సరి కాదని ఆయన అన్నారు.
కావాలంటే చూసి వాస్తవాలు రాయవచ్చునని, అప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటానని, ఉద్యోగులను భయబ్రాంతులను చేయాలనే ప్రయత్నం దుర్మార్గమని అన్నారు. అలాంటి వార్తలు రాయడం నేరమైనప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూస్తామని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుని కలంపోటుతో రాస్తామని సరి కాదని అన్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాస్తారా అంటూ మండిపడ్డారు.
ఎకరాకు రూ.50 లక్షల చొప్పన ఇండో యూకే ఆస్పత్రికి 150 ఎకరాలు కేటాయించినట్లు, అలాగే అదే ధరపై టిటిడికి 25 ఎకరాలు కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఎస్ఆర్ఎం, అమిట్ సంస్థలు భూమి కేటాయించాలని అడుగుతున్నట్లు తెలిపారు. దుబాయ్ ఆస్పత్రి, బసవతారకం ఆస్పత్రులకు భూమి కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.