బతికినన్నాళ్లు అక్కినేనిలా: ఆనం, అంతేకదా: బాబు
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డిలు ఎదురు పడ్డప్పుడు వారి మధ్య అక్కినేని నాగేశ్వర రావు మృతి విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ... బతికినన్నాళ్లు అక్కినేనిలా సంతోషంగా బతకాలన్నారు. దానికి చంద్రబాబు ఆయన భుజం తడుతూ అంతేకదా అన్నారు.
రాజ్నాథ్ సంతాపం
అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ తన సంతాపం వ్యక్తం చేశారు. భారత చలన చిత్ర రంగానికి అక్కినేని చిరస్మరణీయ సేవలు అందించారన్నారు.
కాగా, అక్కినేని భౌతికాయాన్ని మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, దేవీశ్రీ ప్రసాద్, ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్, రాధిక, రామోజీరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణం రాజు దంపతులు, జానా రెడ్డి, జయసుధ, చంద్రబాబు నాయుడు, డికె అరుణ, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా తదితరులు నివాళులు అర్పించారు. సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఓఝా అన్నారు.