కెసిఆర్ అంటే నీకు భయం.. కాదు నీకే: జగన్Xబాబు, నవ్వేసిన శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రస్తావించారు. కెసిఆర్ అంటే నీకు భయమంటే, నీకు భయమని ఇరువురు పరస్పరం వాగ్వాదం చేసుకున్నారు.
జగన్ మాట్లాడుతూ.. కృష్ణా నుంచి రావాల్సిన నీటిని పాలమూరు నుంచి రంగారెడ్డి దాకా పంపు ద్వారా తోడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అడగకపోడం విడ్డూరమన్నారు.
గోదావరి ప్రాజెక్టుల గురించి కెసిఆర్ మహారాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో మంతనాలు జరుపుతున్నారని, చంద్రబాబు మాత్రం కెసిఆర్తో ఎందుకు మంతనాలు జరపడం లేదన్నారు. అందుకు ఒకటే కారణం అన్నారు. ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు తెలంగాణను అడగటం లేదన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. ఆయనకు బొత్తిగా సబ్జెక్ట్ తెలియదన్నారు. తెలియకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గోదావరి ట్రైబ్యునల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు. బొత్తిగా సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు.
ఇంతకుముందే చెప్పానని, మనకు పైన కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయని చెప్పానని గుర్తు చేశారు. కెసిఆర్ అంటే నాకు భయం ఎందుకన్నారు. తెలంగాణలో దొంగ ఆస్తులు పెట్టుకున్నావు కాబట్టి నీకు భయం, ఆయన అంటే నాకు ఏం భయమని ప్రశ్నించారు.
ప్రతి శుక్రవారం ఎవరు కోర్టుకు వెళ్తారన్నారు. తాను ఏపీ హక్కులు కాపాడేందుకు చిత్తశుద్ధితో ఉన్నానని చెప్పారు. తనను వైయస్ రాజశేఖర రెడ్డియే ఏం చేయలేకపోయారని చెప్పారు. 20 కేసులు పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టును మీ నాన్న ప్రారంభించలేదని, అంజయ్య ప్రారంభించారని దానిని గుర్తుంచుకోవాలన్నారు.
ఎప్పుడో శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును దేవుడు తన చేతికి ఇచ్చారని చెప్పారు. సబ్డెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని, అది మీకు తెలియదని, అందుకే మీకు పాఠాలు చెప్పాలని అంటున్నానని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలియకుండా సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నారు.
ఓ ప్రతిపక్ష నేత సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడితే బాధగా ఉందన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజల వైపు ఉండాలన్నారు. ప్రజల కోసం మేం ఏమైనా మర్చిపోతే, తప్పు చేస్తే మాకు గుర్తు చేయాలన్నారు. కానీ జగన్ మాత్రం సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు.
మాకు అధికారం లేదు అనే విధంగా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సభలో తెలియని విషయాలు మాట్లాడవద్దని, తెలుసుకొని మాట్లాడాలన్నారు. మీకు సమాచారం కావాలంటే ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. అందరూ ఏపీ ప్రయోజనాల కోసం పని చేయాలన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం గురించి జగన్ చులకనగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్కు దండం పెట్టి చెబుతున్నానని, తెలుసుకొని మాట్లాడాలన్నారు.
బాబు వ్యాఖ్య, నవ్వేసిన శ్రీకాంత్ రెడ్డి
చంద్రబాబు ఏపీలో అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తానని చెబుతూ... జగన్ వద్దని అడ్డంగా పడుకున్నా నీళ్లిస్తామని, ఎత్తిపోతల పథకాన్ని వదిలి పెట్టేది లేదన్నారు. చివరకు రాయచోటికి కూడా వస్తానని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాయచోటికి కూడా నీళ్లు ఇస్తానని, సభలో నువ్వు అడ్డుపడ్డావని ప్రజలకు చెప్తానని, పక్కన కూర్చొని జగన్కు ఎక్కించావని చెబుతానని, అయినా నీళ్లుతీసుకొచ్చానని చెబుతానని అన్నారు. దానికి శ్రీకాంత్ రెడ్డి అలాగే సర్ అంటూ నవ్వుతూ తల ఊపారు.