ఏపీలో ఆటో డ్రైవర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్..!
ఏపీలో ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10 వేల చొప్పున సాయం అందించే వారు. జగన్ నవరత్నాల హామీ అమలులో భాగంగా ఇలా ఇచ్చే 10 వేల రూపాయలతో వారు ఆటోలకు చిన్న చిన్న రిపేర్లు, ఇన్సూరెన్స్ తీసుకోవడం వంటివి చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి ఈ సాయం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
నిన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. అదే సమయంలో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటామని వెల్లడించారు. దీంతో ఆటో డ్రైవర్లకు ఊరట కలగబోతోంది.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయనున్న నేపథ్యంలో తమకు ఇబ్బందులు ఉంటాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో వారికి కూడా అదే రోజు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటివరకూ ఆటో డ్రైవర్లకు సాయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ చంద్రబాబు ఉన్నట్లుండి ఇలా ఆటో డ్రైవర్లకు సాయంపై చేసిన ప్రకటనపై చర్చ జరుగుతోంది.

గతంలో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10 వేల రూపాయలు సాయంగా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి పేరు మార్చి అదే మొత్తం ఇస్తారా లేక అంతకన్నా ఎక్కువే ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. అప్పట్లో అందిన 10 వేలు ఇచ్చినా చాలని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications