ఇవి ఇస్తాం, భూమి ఇవ్వకుంటే..: బాబు, రేపటి నుండి ల్యాండ్ పూలింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏపీ రాజధాని భూసమీకరణ పైన విధాన ప్రకటన చేశారు. భూసమీకరణకు చాలా కసరత్తు చేశామని తెలిపారు. భూసమీకరణను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. రైతులకు తమ పైన విశ్వాసం ఉందన్నారు.
మెట్ట, జరీబు భూములకు వేర్వేరుగా పరిహారం ఇస్తామని చెప్పారు. భూమి ఇచ్చిన రైతులకు 1000 గజాల నివాస, 300 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని చెప్పారు. మెట్ట ప్రాంతానికి రూ.30వేలు వార్షిక ఆదాయం ఇస్తామన్నారు. భూములిచ్చిన రైతులకు చట్టబద్ధమైన రసీదు ఇస్తామని చెప్పారు.
భూసమీకరణకు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు చెప్పారు. భూములిచ్చే రైతులకు పన్ను రాయితీ ఉంటుందన్నారు. మెట్ట ప్రాంతంలో రూ.30వేలు ఏటా ఇస్తామని, పదేళ్ల పాటు ఏటా పది శాతం పెంచుతామని చెప్పారు. మూడెకరాలు సాగు చేస్తే వచ్చే మొత్తాన్ని రైతులు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు.
ఆలయాల భూముల ఆదాయాన్ని వాటికే వెచ్చిస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి కొత్తవి కట్టిస్తామని తెలిపారు. నిమ్మ, బత్తాయి తోట రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇస్తామన్నారు. భూములు ఇచ్చే ప్రాంతంలో ఏడాది పాటు ఉపాధి కల్పిస్తామన్నారు.
రాజధాని ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కార్మికులకు, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రైతులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. రేపు ఉదయం నుండి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఒకవేళ భూములు ఇవ్వకుంటే చట్టం ద్వారా సేకరిస్తామన్నారు.
రాజధానిని కట్టుకునే అవకాశం రావడం గర్వకారణమన్నారు. పొలాల్లో టేకు చెట్లు ఉన్నవాళ్లు అమ్ముకోవచ్చునని తెలిపారు. భూములలో ఉన్న పంటలు రైతులకే చెందుతాయని చెప్పారు. రైతులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. ఏ ప్రాంత రైతులకు ఆ జోన్లోనే కేటాయిస్తామన్నారు.
కృష్ణా నది తీరంలో ఉండే భూములు జరీబు భూములు అన్నారు. మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. స్థానికులకు ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వం అద్దెకు తీసుకుంటుందన్నారు. రిజిస్ట్రేషన్లు ఆపలేదని, ఆపబోమన్నారు. రాజధానిలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఏపీలో ఎయిమ్స్: కామినేని
ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ నిర్మాణాన్ని జనవరిలో ప్రారంభించనున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు మంగళగిరిలో ఎయిమ్స్కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. దానికోసం 190 ఎకరాలు కేటాయించామని చెప్పారు.
మరో ఐదు ఎకరాల అటవీభూమిని కూడా కేటాయిస్తామన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కామినేని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి ఎయిమ్స్ అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర బృందం పర్యవేక్షణ తరువాత ఎయిమ్స్కు నిధులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారన్నారు.