బైజూస్ ఖేల్ ఖతం! కోర్టు సంచలన తీర్పు..
భారతీయ ఎడ్టెక్ రంగంలో ఒకప్పుడు తిరుగులేని మహారాజుగా వెలిగిన బైజూస్ (Byju's) వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు అంతర్జాతీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ 'బ్లూమ్బెర్గ్' సంచలన నివేదికను వెల్లడించింది. వరుస వివాదాలు, రుణాల ఎగవేత ఆరోపణలతో ఇప్పటికే సతమతమవుతున్న బైజూ రవీంద్రన్ ప్రతిష్టను ఈ జైలు శిక్షా కాలం మరింత మసకబార్చింది. అంతేకాకుండా.. మే 27, 2026 నాటికి ఆయన సుమారు 70,500 డాలర్ల జరిమానా చెల్లించి, కోర్టు అధికారుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం డెడ్లైన్ విధించడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
సింగపూర్ కోర్టు నివేదికల ప్రకారం.. బైజూ రవీంద్రన్ 2024 ఏప్రిల్ నెల నుండి తన వ్యక్తిగత, వ్యాపార ఆస్తులకు సంబంధించిన పలు కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తూ వచ్చారు. ముఖ్యంగా 'బీఅర్ ఇన్వెస్ట్కో పీటీఈ' (Beeaar Investco Pte) అనే అనుబంధ సంస్థలో ఆయనకు ఉన్న చట్టబద్ధమైన యాజమాన్యాన్ని, షేర్ల వివరాలను నిరూపించే కీలక పత్రాలను సమర్పించడంలో రవీంద్రన్ ఘోరంగా విఫలమయ్యారు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడం, ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన సింగపూర్ కోర్టు.. ఆయనకు ఆరు నెలల కఠిన జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం రవీంద్రన్ సింగపూర్లోనే ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో 'కౌంటర్' ఫైట్
ఒకప్పుడు బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్న సమయంలో కంపెనీకి అండగా నిలిచిన ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) అనుబంధ సంస్థే ఇప్పుడు రవీంద్రన్ను కోర్టు ఈడ్చడం గమనార్హం. ఈ చట్టపరమైన పోరాటంలో ఖతార్ హోల్డింగ్స్ తరఫున ప్రముఖ లా ఫర్మ్ 'డ్రూ & నేపియర్' వాదనలు వినిపించగా, బైజూస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున 'ఫెర్వెంట్ ఛాంబర్స్' న్యాయవాదులు వాదించారు. అయినప్పటికీ రవీంద్రన్ వైపు తగిన ఆధారాలు లేకపోవడంతో కోర్టు జైలు శిక్ష వైపే మొగ్గు చూపింది.
గ్లోబల్ పీడకలగా మారిన బైజూస్ ప్రస్థానం
భారతీయ స్టార్టప్ ప్రపంచంలో 'థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్' (బైజూస్ మాతృసంస్థ) ఒక గొప్ప విజయ గాథగా నిలిచింది. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన బైజూ రవీంద్రన్.. కొన్నేళ్లలోనే బిలియనీర్ల క్లబ్లోకి చేరిపోయారు. కానీ, అనాలోచిత విస్తరణ, విదేశీ రుణాల భారంతో ఇప్పుడు పతనం అంచుకు చేరారు. ఇప్పటికే అమెరికాలో 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 వేల కోట్లు) నిరర్థక రుణానికి సంబంధించి అక్కడి రుణదాతలు రవీంద్రన్ నుండి రికవరీ చేసేందుకు చట్టపరంగా వేటాడుతున్నారు. ఇప్పుడు సింగపూర్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన గ్లోబల్ బిజినెస్ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలినట్లయింది.














Click it and Unblock the Notifications