కొంత మంది నేతలకు రాజకీయాలే కావాలి: చంద్రబాబు
విజయవాడ: కొంత మంది నాయకులు ప్రచారం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెసు నాయకులు బీసీలపై కక్ష కట్టారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదని అన్నారు.
కొందరికి రాజకీయాలూ వివిదాలే కావాలని, ప్రజాసమస్యలు పట్టవని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన శనివారంనాడు బీసీ రుణమేళాను ప్రారంభించారు. బీసిలు వెనకబడిపోయారని, బీసీలకు తమ ప్రభుత్వం మాత్రమే మేలు చేసిందని చెప్పారు.
బీసీలు లేకుంటే టిడిపి లేదని ఆయన చెప్పారు. చేనేత రుణాలను మాఫీ చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆయన అన్నారు. బీసీలు శక్తిగా ఎదగడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఆదరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
నైపుణ్యానికి ఆధునిక పరికరాలు ఇస్తే ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. బీసీ వృత్తులకు ఆదాయాలను పెంచి గౌరవాన్ని పెంచుతామని ఆయన చెప్పారు. బ్యూటీ పార్లర్స్ ఆ కులంవాళ్లు పెట్టుకునే విధంగా చూస్తామని చంద్రబాబు చెప్పారు. 139 బీసీ కులాలకు న్యాయం చేస్తానని, అవసరమైతే సర్వే చేయించి తగిన సహాయం అందిస్తానని ఆయన చెప్పారు.
ఆర్థిక అసమానతలను తగ్గించడాన్ని తాను కార్యక్రమంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తమది పేదల ప్రభుత్వమని చెప్పారు. బీసీ విద్యార్తులు ఉన్నత చదవులు అందుకుని, ఉన్నత పదవులు చేపట్టడానికి ప్రభుత్వం సహకరిస్తామని చెప్పారు. మత్స్యకారులకు పెట్రోల్, డీజిల్లపై రాయితీలు ఇస్తుందని ఆయన చెప్పారు.
సమాజంలో రెండే కులాలున్నాయని, ఒకటి డబ్బులున్న కులం.. రెండోది డబ్బులు లేని కులమని ఆయన అన్నారు. ఏ కులంలో ఉన్నా డబ్బులుంటే చాలునని ఆయన అన్నారు. డబ్బులు లేకుంటే కులం గుర్తు చేసి అవమానిస్తారని ఆయన అన్నారు.