హైద్రాబాద్ విడిచి వెళ్లండి: చంద్రబాబుకు మహేందర్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రుల పైన తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులకు, సీఎంకు చీము, నెత్తురు ఉంటే హైదరాబాద్ విడిచి, ఆంధ్రా నుంచే పాలన కొనసాగించాలన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేక, హైదరాబాద్ను విడిచి వెళ్లలేక ఏపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. మా తెలంగాణ గురించి గానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన గానీ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ పైన విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.
ఈ నెల 19న తలపెట్టిన సర్వే పేదవారిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నదన్నారు. అక్రమ కట్టడాల పైన తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. వద్దని చెప్పేందుకు టీ-టీడీపీ నేతలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రభుత్వం పైన అర్థరహిత విమర్శలు మాని, ఆచరణ సాధ్యమైన సూచనలు చేయాలన్నారు.