స్టీఫెన్సన్తో బాబు సంభాషణ: ఫోన్ కలిపి ఇచ్చిన వ్యక్తి ఎవరు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో మాట్లాడడానికి ముందు మరో వ్యక్తి గొంతు వినిపించింది. స్ఠీఫెన్సన్కు మూడో వ్యక్తి ఫోన్ కలిపి అందించారు. సోమవారం రాత్రి లీక్ అయిన ఆడియో రికార్డులు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రబాబు స్టీఫెన్సన్తో నేరుగా మాట్లాడారు.
తమకు మద్దతు ఇస్తే అండగా ఉంటామని చంద్రబాబు స్టీఫెన్సన్కు హామీ ఇచ్చారు. స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడడానికి ముందు ఓ గొంతు వినిపించింది. బాబుగారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆయన లైనులో ఉన్నారని అంటూ ఓ వ్యక్తి స్టీఫెన్సన్కు చెప్పి ఫోన్ను చంద్రబాబుకు ఇచ్చినట్లు ఆడియో రికార్డుల్లో ఉంది.
చంద్రబాబుకు స్టీఫెన్సన్ నెంబర్కు ఫోన్ కలిపించి మాట్టాడించిన వ్యక్తి ఎవరనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. చంద్రబాబుకు ఫోన్ కలిపి ఇచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారనేది కేసులో కూడా కీలకం అవుతుందని భావిస్తున్నారు. తొలుత మాట్లాడింది ఎవరు, ఆ నెంబర్ ఏమిటి అనేది కూడా కీలకమే అవుతుందని అంటున్నారు.

అతను చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడై ఉంటాడనేది అందరూ భావిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు మాత్రమే చంద్రబాబు అటువంటి పనులు అప్పగిస్తారు. అయితే, చంద్రబాబు ఫోన్ను ట్యాప్ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే, స్టీఫెన్సన్తో తాను మాట్లాడినట్లు లీకైన ఆడియోపై చంద్రబాబు ఇప్పటి వరకు కూడా నోరు విప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా ఏమీ మాట్లాడడం లేదు. అయితే, తమ ప్రభుత్వంపై కెసిఆర్ కుట్ర చేశారని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications