కేంద్రం నిధులు తీసుకుంటూనే...చంద్రబాబు దుష్ప్రచారం;మోడీ చెప్పలేదు: కన్నా
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ఎప్పుడూ చెప్పలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అసలు చంద్రబాబు ప్రధానిని ఎన్నడూ ప్రత్యేక హోదా అడగలేదన్నారు.
చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.5 వేల కోట్లు అడిగారని, మోడీ మాత్రం రూ. 16,500 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని కన్నా చెప్పారు. ఆదివారం విజయవాడలో బీజేపీ జాతీయ మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ బాజీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా కన్నా లక్ష్మీ నారాయణ టిడిపి ప్రభుత్వంపై, చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
చంద్రబాబు ఓ వైపు కేంద్రం ఇచ్చే నిధులు తీసుకుంటూనే మరోవైపు అదే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వానివైతే...టిడిపి మాత్రం అవి తమవే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటుదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్ ఎందుకు సహరించిందో అర్థం కాలేదని కన్నాలక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా?...అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో టీడీపీ అవినీతిని బయటపెట్టిన బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో జన్మభూమి బ్రోకర్ల పాలన సాగుతోందని కన్నా ధ్వజమెత్తారు.