కులాల మధ్య చిచ్చు పెట్టి, అస్థిరపరిచేందుకే...: జగన్పై చంద్రబాబు ఫైర్
విశాఖపట్నం: కులాల మధ్య చిచ్చుపెట్టడం ద్వారా రాష్ట్రంలో అస్థిరత సృష్టించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విశాఖ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం సర్క్యూట్ హౌస్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
కాపుగర్జన, ముద్రగడ దీక్ష తదితర పరిణామాలపై చర్చించారు. కమిషన్ను నియమించి, వారి సంక్షేమానికి నిధులు మంజూరుచేసినా కొందరు రిజర్వేషన్ల పేరిట ఉద్యమించడం అన్యాయమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ, కాంగ్రెస్లు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఆంధ్రపదేశ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తాను ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్న సమయంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం వల్ల కొంత ప్రతిష్ట దిగజారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో టిడిపి ఎపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రులు కెఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభంతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శనివారం ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కానీ మరో మంత్రి కానీ వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కిర్లంపూడి వచ్చిన భాస్కరరామారావు ముద్రగడతో భేటీ అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.గురువారం ముద్రగడతో చర్చించిన అంశాలను సీఎం దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. శనివారం సీఎంతో మరోసారి మాట్లాడిన అనంతరం ప్రభుత్వం తరఫున ముద్రగడతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కానీ, మరో మంత్రి కానీ కిర్లంపూడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శనివారం సాయంత్రానికి సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.